హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను కల్పించే లక్ష్యంతో కొత్తగా మెట్రో మార్గాలను నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు ఇచ్చిన టెండర్ల గడువు సోమవారంతో ముగియనున్నది. ఈ నెల 18న టెండర్లు పిలవగా, 28వ తేదీని చివరి తేదీగా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ నిర్ణయించింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నగరం నలువైపులా, ఔటర్ రింగు రోడ్డు చుట్టూ మెట్రో మార్గాలను నిర్మించనున్నారు. కొత్తగా 12 మార్గాల్లో మొత్తం 278 కిలోమీటర్ల మేర మూడో దశమెట్రోను నిర్మించేలా కార్యాచరణను హైదరాబాద్ మెట్రో సంస్థ రూపొందించింది.
రాబోయే 40-50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణ, రవాణా అవసరాలకు సరిపడేలా మెట్రో ప్రాజెక్టులను రూపొందించనున్నారు. టెండరు గడువు ముగిసిన వెంటనే అర్హత కలిగిన సంస్థ ప్రతిపాదిత మెట్రో మార్గాలకు సంబంధించిన ట్రాఫిక్ సర్వేలను, డీపీఆర్లను రూపొందించేందుకు సుమారు 2 నెలల గడువు ఇవ్వనున్నారు. ఇప్పటికే మొదటి దశ మెట్రో 69 కి.మీ అందుబాటులో ఉండగా, రెండోదశను రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కి.మీ మేర నిర్మిస్తున్నారు.