హైదరాబాద్ : ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబీకులు నివాళులర్పించారు. ఆయనతో పాటు నందమూరి రామకృష్ణ, సుహాసిని ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళుర్పించి, ఆయన సేవలను గుర్తు చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ను మరిచిపోరన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ స్ఫూర్తిగా నిలిచారని, మాట తప్పని వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారని, బడుగు బలహీన వర్గాలు, పీడిత ప్రజలకు పదవులు ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో 610 జీవోను తీసుకొచ్చింది ఎన్టీఆరేన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని 610 జీవోలు అమలు చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు.