తాండూరు, మే 18: కండ్లముందే తండ్రి విగతజీవిగా ఉన్నా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని తండ్రి ఆశయం నెరవేర్చాలని పరీక్షకు హాజరయ్యాడు ఓ కొడుకు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం రాంపూ ర్ కిందితండాకు చెందిన రవి (37) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవాడు. మంగళవారం రవి పొలం పనులు చేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
బుధవారం అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. రవి పెద్ద కొడుకు నిఖిల్ తాండూరులో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నాడు. కన్నతండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు. తండ్రి పడిన కష్టం గుర్తుకు రావడంతోపాటు తాను ఎస్సై కావాలనే నాన్న ఆశయం నెరవేర్చడం కోసం పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి వచ్చి తండ్రి అంత్యక్రియలు నిర్వహించాడు.