హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పోషకాహార లోపంపై కొన్ని రోజులుగా పలు రాష్ర్టాలకు చెందిన నెటిజన్లు మంత్రి కేటీఆర్కు వరుస ట్వీట్లు పెడుతున్నారు. ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారత్ 101 స్థానంలో ఉంది. పోషకాహారలోపంపై వెంటనే దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలి’ అని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ గతంలో చేసిన ఓ ట్వీట్పై బెంగళూరుకు చెందిన మోహన్దాస్ అనే వ్యక్తి శుక్రవారం స్పందించారు. ‘కేటీఆర్.. తెలంగాణను మీరు 8 ఏండ్లుగా పాలిస్తున్నారు.
దయచేసి పోషకాహార లోపంపై మీ రాష్ట్రం డాటాను విడుదల చేయండి’ అని ట్విట్టర్లో కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ ప్రతిస్పందించారు. ‘చాలెంజ్ను స్వీకరిస్తున్నాను మోహన్.. రాబోయే 18 నెలల్లో మీరు మా రాష్ట్రంలోని పోషకాహార లోప గణాంకాలలోఅద్భుతమైన మార్పును చూస్తారు’ అని ట్వీట్ చేశారు. దీనిపై శనివారం గుజరాత్కు చెందిన డాక్టర్ బకుల్ జవదేకర్.. ‘ఈ జవాబుతో మీ దగ్గర చూపించడానికి ఏమీ లేదని అంగీకరిస్తున్నారా?.. మీరు ఏం చేశారో చూపించమని అడిగారు. ఏం చేస్తారోనని కాదు’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆయనకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘సార్.. మీరు గుజరాత్కు చెందిన డాక్టర్ అని మీ బయోలో ఉన్నది. ఆరోపణలు చేసే ముందు దయచేసి ఆలోచించండి. 28 ఏండ్లు బీజేపీకి అధికారం ఇచ్చిన మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కంటే.. 8 ఏండ్లలో తెలంగాణ సాధించింది చాలా ఎక్కువ. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చూసి మీ అవగాహన పెంచుకోండి’ అంటూ చురకలు అంటించారు. నెటిజన్లు సైతం మంత్రి కేటీఆర్కు మద్దతుగా నిలిచారు. ఏ విషయంలో చూసినా గుజరాత్ కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని.. కావాలంటే ఒకసారి రాష్ర్టానికి వచ్చి చూడాలని సవాళ్లు విసురుతూ ట్వీట్లు చేశారు.