సూర్యాపేట : మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని టీఎంఆర్పీఎస్(TMRPS) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ(Vangapalli Srinivas Madiga) అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి దళితుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దళితుల జీవితాల్లో నూతన వెలుగులు నింపిన బీఆర్ఎస్ పార్టీ కే రానున్న ఎన్నికల్లో మా మద్దతు అన్నారు. సోమవారం సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి ఎమ్మార్పిఎస్ నాయకులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
సూర్యాపేటతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు 29 ఏండ్లుగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా మాదిగలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు మాదిగలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకొంటూ అభివృద్ధిని, ఆర్థిక స్థితిగతులను మార్చే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింత బాబు మాదిగ, రాష్ట్ర నాయకులు పల్లేటి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు ఏర్పుల సాయి మాదిగ, బచ్చలకూరి నాగరాజు, కడప పెంటయ్య, దుబ్బ రమేష్ , మేడి నరసింహ, మామిడి సైదయ్య,పెడమర్తి విజయ్ పాల్గొన్నారు.