హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): శ్రీవాణి (శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్ట్ ద్వారా శ్రీవారికి ఈ ఏడాది మే 31 నాటికి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా భక్తులు రూ.861 కోట్లకు పైగా విరాళాలు అందించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ట్రస్టుకు భక్తులు అందించిన విరాళాలపై శుక్రవారం తిరుమలలో ఆయన శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. టీటీడీ బోర్డు తీర్మానం మేరకు పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాలు, మందిరాలు నిర్మాణాలకు తోడ్పాటును అందించే ప్రధాన లక్ష్యంతో 2018 ఆగస్టు 28న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైందని వివరించారు.
రూ.10 వేల విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారని చెప్పారు. 176 పురాతన ఆలయాల పునరుద్ధరణకు రూ.93 కోట్లు మంజూరు చేశామని, వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ.10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని వివరించారు. టీటీడీ ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం డిపాజిట్లపై శ్వేతపత్రంలో వివరించామని చెప్పారు. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ ట్రస్టు నిధులపై నిరాధార ఆరోపణలు చేస్తూ, భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.