హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): కష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు చేయూతనిచ్చేందుకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్సీఎల్) సత్ఫలితాలను ఇస్తున్నది. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, మార్కెటింగ్లో ఇబ్బందులు, బ్యాంకుల నుంచి రుణాల సేకరణలో సమస్యలు, విద్యుత్తు కనెక్షన్లు, ఇతరత్రా సమస్యల వల్ల నష్టాల్లో కూరుకుపోయి మూతపడే దశకు చేరుకున్న ఎంఎస్ఎంఈలకు టీఐహెచ్సీఎల్ ఇతోధిక సేవలందిస్తున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎఫ్టీసీసీఐతోపాటు పరిశ్రమల రంగానికి చెందిన మరో రెండు సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కలిగివున్న టీఐహెచ్సీఎల్.. గత నాలుగేండ్లలో 334 యూనిట్లకు కన్సల్టెన్సీ సేవలు అందించడంతోపాటు 34 యూనిట్లకు రూ.407.28 లక్షల రుణాలు ఇప్పించింది. మరో 143 యూనిట్లపై అధ్యయనం నిర్వహించి వాటి నష్టాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై డయాగ్నస్టిక్ స్టడీ నివేదికలను అందించింది. బ్యాంకుల వేలంపాట నుంచి దాదాపు రూ.1.30 కోట్ల ఆస్తులను బయటపడేయడంతోపాటు దాదాపు 1,770 మంది కార్మికుల ఉపాధిని కాపాడింది.
నాలుగేండ్లలో టీఐహెచ్సీఎల్ సేవలు
చిన్నతరహా యూనిట్లకు ఎంతో మేలు
టీఐహెచ్సీఎల్తో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతున్నది. అవి ఎదుర్కొనే సమస్యలకు తగిన పరిష్కారాలను చూపేందుకు ఇది మంచి వేదిక. దేశంలో ఇటువంటి సంస్థ మరెక్కడా లేదు. నిర్లక్ష్యం వల్లనో, నిర్వాహకుల సొంత కారణాల వల్లనో ఎంఎస్ఎంఈలు నష్టాల్లో కూరుకుపోతే తప్ప ఇతర ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేందుకు ఇది కృషిచేస్తుంది. టీఐహెచ్సీఎల్ను సంప్రదించిన వారికి తప్పకుండా తగిన సహాయం లభిస్తుంది. ఇప్పటికే దీని ద్వారా అనేకమంది సహాయం పొందుతున్నారు.
-జయేశ్రంజన్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి