హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తేతెలంగాణ): వాతావారణ మార్పుల నేపథ్యంలో బెట్ట, కరవు, తెగుళ్లు, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చేలా ఇక్రిశాట్ సహకారంతో రూపొందించిన మూడు రకాల శనగ వంగడాలు (ఐపీసీఎల్-4, బీజీఎం 4005, ఐపీసీఎంబీ 19-3) విడుదలయ్యాయి. కాన్పూర్లోని ఐసీఏఆర్, భారతీయ పప్పుధాన్యాల పరిశోధన సంస్థ- ఐఐపీఆర్, న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ- ఐఏఆర్ఐ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ విత్తనాల విడుదలకు సెంట్రల్ వైరైటల్ రిలీజ్ కమిటీ నోటిఫికేషన్ జారీచేసింది. బీజీఎం 4005, ఐపీసీఎంబీ 19-3 శనగ విత్తనాలు సహా వివిధ పంటలకు సంబంధించిన 35 రకాల వంగడాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెల 28నే జాతికి అంకితం చేశారు. పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో సాగుకు అనువుగా ఉండే ఈ విత్తనాల ద్వారా సగటు కంటే 11.9 నుంచి 14.76 శాతం అధిక దిగుబడి పొందవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.