పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 13 : విహార యాత్ర విషాదయాత్ర గా మారింది. సరదాగా గడిపేందుకు నాగార్జునసాగర్కు వెళ్లిన బీఫార్మసీ విద్యార్థుల్లో ముగ్గురు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శనివారం చోటుచేసుకొన్నది. పోలీసులు, మృతుల స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బిచ్కుందకు చెందిన దిండి ఆకాశ్ (20), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన బంటు గణేశ్ (20), మహారాష్ట్రకు చెందిన పండిట్ కృష్ణ (18)తోపాటు లోహిత్, అన్వేష్, చందు, ప్రియాంక రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరి బాలాజీ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్నారు. పండిట్ కృష్ణ తండ్రి గజానంద్ పుట్టంగండి డీఏవీ పాఠశాలలో పనిచేస్తున్నారు. కృష్ణతోపాటు అతని స్నేహితులు రెండ్రోజుల క్రితం అతని ఇంటికి వచ్చారు. శనివారం సాగర్, పుట్టంగండి ప్రాంతాల్లో పర్యటించిన వారు చివరగా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. రిజర్వాయర్ ప్రధాన గేట్ల సమీపంలోని మెట్ల వద్ద స్నానం చేసేందుకు గణేశ్, కృష్ణ, ఆకాశ్ దిగారు. ఈత రాక మునిగిపోతున్న ఒకరిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఒకరి తర్వాత మరొకరు ఇలా ముగ్గురు కాల్వలో మునిగిపోయారు. పైన ఉన్న స్నేహితులు గమనించి కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వ్యక్తులు వచ్చి కాల్వలోకి దూకి ఇద్దరిని బయటకు తీశారు. వారు అప్పటికే మృతిచెందారు. మరొకరి మృతదేహాన్ని జాలర్లు గంట సేపు వెతికి బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ రవీందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.