Warangal | కాజీపేట : దీపావళి పండుగ రోజున ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడం హనుమకొండ జిల్లాలోని దర్గా కాజీపేటలో తీవ్ర విషాదం నింపింది. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో కూతురితో కలిసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా ఆ విషయం తెలుసుకున్న ఆమె అత్త గుండెపోటుతో మృతి చెందింది.
కాజీపేట ఏసీపీ డేవిడ్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. దర్గా కాజీపేట, భీంనగర్లో గత కొంతకాలంగా కన్నెబోయిన రవి ప్రసాద్-రేణుక(36), కూతురు నవ్య(14), తల్లి ఇజ్జమ్మతో(75) కలిసి నివసిస్తున్నారు. రవిప్రసాద్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇటు తల్లి ఇజ్జమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. దీంతో రవిప్రసాద్ భార్య రేణుక ఇజ్జమ్మకు సపర్యలు చేస్తోంది. అయితే రేణుక కూడా నరాల బలహీనత సమస్యతో గత ఏడాది కాలంగా బాధపడుతోంది. కానీ వైద్యానికి డబ్బుల్లేక అవస్థలు పడుతోంది. ఇక చేసేదేమీ లేక మనస్తాపానికి గురైన రేణుక చనిపోవాలని నిర్ణయించుకుంది. కానీ తాను మరణించిన తర్వాత తన బిడ్డ నవ్య పరిస్థితి ఏమవుతుందోనని భావించి, కూతురిని తీసుకొని స్థానిక బంధం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
విషయం తెలిసిన వెంటనే అత్త ఇజ్జమ్మ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచింది. భార్య రేణుక, కూతురు నవ్య కనిపించడం లేదని ఈ నెల 10న రాత్రి కాజీపేట పోలీసుకు రవి ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఎస్సై లలిత కేసు నమోదు చేశారు. కాగా ఆదివారం చెరువులో వారిద్దరు మృతదేహాలను గుర్తించారు. పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించి బందువులకు అప్పగించారు. ఒకే కుటుంబంలో ఒకే రోజు ముగ్గురు మహిళలు మృతి చెండడంతో దర్గా కాజీపేటలో విషాదం నెలకొంది.