గోవర్ధన గిరిధారిగా నృసింహుడు
సింహరూఢుడిగా వాహనసేవ
నేడు స్వామివారికి ఎదుర్కోలు
యాదాద్రి, మార్చి 20 : కాపాడు గోపాలా అంటూ గోపాలుడు స్వామివారిని వేడుకోగా జీవులను, వేదాలను, ఇంద్రియాలను సంరక్షించేందుకు తన మహిమలను లోకానికి చాటిన ప్రత్యేక ఘట్టమైన గోవర్ధన గిరిధారి అలంకార సేవ యాదాద్రి దివ్య బాలాలయంలో భక్తులను అలరించింది. మహిమాన్విత క్షేత్రం యాదాద్రి కొండగుహలో కొలువైన పంచనారసింహుడు శనివారం గోవర్ధనగిరిధారిగా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తజనులను అలరించారు. బ్రహ్మోత్సవాల్లో స్వామిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడుమచేత పిల్లనగ్రోవి, కుడిచేతి చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన స్వామివారిని పట్టు పీతాంబరాలతో అలంకరించి బాలాలయంలో అధిష్టించారు. చతుర్వేదాలు, మూలమంత్ర జపాలు చేస్తూ రుత్వికులు ముందు నడుస్తుండగా, భక్తుల గోవింద నామస్మరణ నడుమ తిరువీధిసేవ వైభవోపేతంగా సాగింది. అంతకుముందు నిత్యహోమం నిర్వహించారు. పారాయణికులు శ్రీరామాయణ, భాగవత, పారాయణాలు గావించారు.
యాదాద్రిలో సంప్రదాయ పూజలు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం స్వామివారికి సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.