హైదరాబాద్, ఫిబ్రవరి1 (నమస్తే తెలంగాణ): పోలవరం డైవర్షన్ ద్వారా నాగార్జునసాగర్ ఎగువన వినియోగించుకోవాల్సిన 45 టీఎంసీల జలాలు తెలంగాణకే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో కౌంటర్ అఫిడవిట్ను బుధవారం దాఖలు చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 246పై స్టే విధించాలని కోరుతూ బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ కౌంటర్ దాఖలుకు తెలంగాణ ప్రభుత్వానికి నాలుగువారాల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్లో తెలంగాణ సర్కారు తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. 1974 బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లించినట్టయితే, నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 80టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుందని, ఆ మొత్తం నీటిని కృష్ణా బేసిన్లోని రాష్ర్టాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున నీటివాటాను కేటాయించారని వివరించారు.
ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువన మాత్రమే, అదీ ఇన్ బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ స్పష్టంగా నొక్కిచెప్పింది. దాని ప్రకారం ఆ 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణ రాష్ర్టానికే దక్కుతాయని తెలిపింది. ఇక ట్రిబ్యునల్ కేటాయించిన నీటి వాటాలను కర్ణాటక, మహారాష్ట్రలు ఇప్పటికే వినియోగించుకుంటున్నాయని వివరించింది. గోదావరి డైవర్షన్ నుంచి దక్కిన 21 టీఎంసీల నీటి వాటాలో నుంచి 2.4 టీఎంసీలను అప్పర్భద్రకు కర్ణాటక రాష్ట్రం కేటాయించుకున్నదని, అందుకు కేంద్రం అనుమతించడమే కాదు, ఏకంగా ప్రాజెక్టుకే జాతీయ హోదాను ప్రకటించిందని గుర్తుచేసింది. తెలంగాణ తన నీటి వాటా 45 టీఎంసీలతోపాటు, మైనర్ ఇరిగేషన్లో మిగులుతున్న మరో 45 టీఎంసీలను మొత్తంగా ప్రాజెక్టుకు కేటాయించుకుందని కౌంటర్లో స్పష్టం చేసింది. తెలంగాణ జీవోపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలన్నీ అర్థరహితమని కొట్టిపారేసింది. ఇదిలా ఉండగా తెలంగాణ కౌంటర్కు సమాధానం దాఖలు చేసేందుకు ట్రిబ్యునల్ ఏపీకి రెండువారాల గడువు ఇచ్చింది.