బండ్లగూడ,సెప్టెంబర్ 11: నిరుపేదలకు విద్యం, వైద్యం అందించడానికి వారు చేస్తున్న కృషి అభినందనీయం. ఏటా వినాయకచవితి తర్వాత వారు చేసే సహాయానికి హ్యాట్సాప్. ఏడేండ్లుగా సమాజ సేవ కోసం పరితపిస్తున్న హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్మౌండ్ విల్లా వాసులపై ఓ లుక్కేద్దాం. వీరు ఏటా వినాయకుని లడ్డూ వేలం పాటలో పాల్గొని, వచ్చిన ఆ మొత్తాన్ని ఎన్జీవో సంస్థతో కలిసి నిరుపేద విద్యార్థుల విద్య, వైద్యానికి వెచ్చిస్తున్నారు. 2016లో వీరు వినాయకుడిని ప్రతిష్ఠించగా, వేలం పాటలో రూ.2లక్షలకు లడ్డూ ధర పలికింది. ఆ డబ్బును సమీప ట్రస్టు ద్వారా పేద విద్యార్థుల సహాయార్థం పంపిణీ చేశారు. బాహుబలి,శక్తిమాన్, బాల్ గణేశ్, చోటాభీమ్ అనే పేర్లతో విల్లా వాసులు గ్రూప్గా ఏర్పడ్డారు. ఒక్కొక్క గ్రూప్లో ఏడుగురు లేదా ఎనిమిది మంది సభ్యులుగా ఉండి, వేలం పాటలో పాల్గొంటారు. నిరుడు లడ్డూ వేలంలో రూ.41లక్షలు రాగా, ఓ చారిటబుల్ ట్రస్టు ద్వారా మూడు వేల మంది నిరుపేదల విద్య, వైద్యానికి ఖర్చు చేశారు. ఈ ఏడాది లడ్డూ ధర రూ.60లక్షల 80వేలు పలికింది. ఈసారి 5వేల మందికి ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు విల్లా వాసులు తెలిపారు.