హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున 4.45 నిమిషాలకు సుమారు 5 సెకన్లపాటు ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. దీంతో పలుచోట్ల ఇండ్లలోని వస్తువులు కిందపడ్డాయి. తెల్లవారుజామున నిద్రలో ఉన్న ప్రజలు భూ ప్రకంపనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించింది. భూకంప కేంద్రం 30 కిమీ లోతుగా ఉన్నట్టు గుర్తించారు. పాత మణుగూరు, శేషగిరినగర్, బాపనకుంట, శివలింగాపురం, విట్టల్రావునగర్, రాజుపేట ప్రాంతంలో భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. వారం రోజుల వ్యవధిలోనే మణుగూరులో రెండుసార్లు భూమి కంపించింది.