హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత కాలంలో రాజకీయ వ్యూహాలు అల్లడంలో కేసీఆర్ను మించినవారు లేరు. ఆయన పాచిక విసిరితే ప్రత్యర్థి విలవిల్లాడాల్సిందే. కేసీఆర్ ఫక్తు రాజకీయ నేతలా కాకుండా, భావోద్వేగాలకు అనుగుణంగా అడుగులేసే నాయకుడు. అతని రాజకీయ దాడి శైలి ‘గెరిల్లా యుద్ధం’ మాదిరి ఉంటుంది. మునుగోడులోనూ కేసీఆర్ ఇదే వ్యూహాన్ని అవలంబించారు. తన బహుముఖ వ్యూహంతో బీజేపీని చిత్తు చేశారు. బీజేపీ గెలుపు.. భవిష్యత్తుకే ప్రమాదమనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. యాంటీ కమలం టీమ్ను ఒకచోటికి చేర్చడంలో సఫలీకృతులయ్యారు. బీజేపీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులను తన టీమ్లో చేర్చుకున్నారు. పాత లీడర్లను చేర్చుకొని క్యాడర్లో పునరుత్తేజం నింపారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదనే విషయాన్ని మునుగోడు ఎన్నికతో మరోసారి రుజువు చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీని వ్యతిరేకించే వ్యక్తులను తమవైపు తిప్పుకోవడంలో కేసీఆర్ విజయం సాధించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు టీఆర్ఎస్లోకి క్యూ కట్టారు. బీజేపీ నేతలు.. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్తోపాటు కాంగ్రెస్ కీలక నేత పల్లె రవికుమార్ గౌడ్ గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు మునుగోడు నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ స్థాయి నేతలు బీజేపీ, కాంగ్రెస్ను వీడి కారు ఎక్కేశారు. ఒకరి తర్వాత మరొకరిని బీజేపీకి దూరం చేయడం ద్వారా ఆ పార్టీ ఆత్మైస్థెర్యాన్ని కేసీఆర్ దెబ్బతీశారు. బీజేపీ, కాంగ్రెస్ క్యాడర్ను ఆత్మరక్షణలో పడేయడంలో సక్సెస్ అయ్యారు. టీఆర్ఎస్లోకి వచ్చిన నేతలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సఫలీకృతమయ్యారు.
మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్రెడ్డి అక్కడ తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆయన విక్టరీకి సీపీఐ బ్రేక్ వేసింది. నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఐదుసార్లు సీపీఐ విజయం సాధించింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన స్వలాభం కోసం కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడంతో మళ్లీ ఎన్నికలొచ్చాయి. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీని ఆదిలోనే అడ్డుకోవడం కోసం కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహాలు రచించారు. బీజేపీని ఓడించడానికి కమ్యూనిస్టులతో కలిసి నడిచారు. దీంతో దేశంలో బీజేపీపై బీఆర్ఎస్ చేయబోయే యుద్ధంలో సీపీఐ, సీపీఎంలతో కలిసి ముందుగు సాగేందుకు మునుగోడు మైత్రితో తొలి అడుగు పడినట్టయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.