Employees Transfers | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల బదిలీల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే తమకు అనుకూలురైన అధికారులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చేపట్టిన బదిలీలు కిష్కింధకాండను తలపిస్తున్నాయి. కొందరిని రోజుల వ్యవధిలోనే రెండుమూడు చోట్లకు బదిలీ చేయటం.. కొందరినైతే బదిలీ అయిన చోట చేరకముందే మరోచోటికి తరిమేయటం వంటి ఘటనలు పాలనా యంత్రాంగంలో నెలకొన్న గందరగోళానికి అద్దంపడుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే భారీ ఎత్తున జిల్లా, రాష్ట్రస్థాయి అధికారుల బదిలీలకు నడుం బిగించింది. అన్ని శాఖల్లో బదిలీలు, డిఫ్యుటేషన్లు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక కాంగ్రెస్ నేతలు బదిలీలపై దృష్టిసారించి గతంలో తమకు సహకరించని వారిని పక్కనపెట్టించడం, అనుకూలంగా ఉన్నవారిని నచ్చినచోటికి బదిలీ చేయించుకోవడంపై దృష్టిపెట్టారు. ఈ గందరగోళంలో సందులో సడేమియా అన్నట్టు కొందరు ఉన్నతాధికారులు లంచాలకు తెరలేపి అందినకాడికి దండుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో గడిచిన 70 రోజులుగా జరుగుతున్న బదిలీల తంతు గమ్మత్తుగా ఉన్నది. కొన్ని పోస్టింగ్లు మళ్లీమళ్లీ వేశారు. ఒకరికే మూడేసి బదిలీ ఉత్తర్వులు వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక్కసారి బదిలీ చేశారంటే అర్థం ఉన్నది. మరి రెండుమూడుసార్లు ఒకే వ్యక్తి ఆర్డర్ కాపీ మారిందంటే.. ఆ లోగుట్టు పెరుమాళ్లకెరుక. గ్రూప్-1, గ్రూప్-2 స్థాయి అధికారులకే కాదు.. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా గత 70 రోజుల్లో రెండేసి బదిలీ ఉత్తర్వులు అందుకున్న సందర్భాలున్నాయి. ఒక ఉత్తర్వు ఇచ్చి.. దాన్ని హోల్డ్లో పెట్టి.. మళ్లీ ఇంకో ఉత్తర్వు ఇచ్చిన తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రెవెన్యూ శాఖలో ఈ నెల 10న భారీగా ఆర్డీవోల బదిలీ జరిగింది. ఆ తర్వాత ఐదు రోజులకే అందులో మార్పులు చేర్పులు చేశారు. కొందరి పోస్టింగ్లను మార్చారు.
రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా ఆర్డీవోలు, తహసీల్దార్ల బదిలీలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఇప్పుడు కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నది. వాళ్లే బదిలీలు, పోస్టింగ్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంట్లో ఒకరిద్దరు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బక్క జడ్సన్ స్వయంగా తీవ్ర ఆరోపణలు చేశారు. భద్రాచలం దేవస్థానంలో ఈవోగా ఉన్న ఎల్ రమాదేవిని కీసర ఆర్డీవోగా నియమించి, రెండు రోజుల్లోనే తిప్పి పంపేశారని, హైదరాబాద్ అర్బన్ సీలింగ్ విభాగంలో ఉన్న వెంకట ఉపేందర్రెడ్డిని రాజేంద్రనగర్కు పంపి మళ్లీ ట్రాన్స్ఫర్ను రద్దు చేశారని ఉదహరించారు. వెయిటింగ్లో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదిలక్ష్మిని మొదట వరంగల్ అదనపు కలెక్టర్గా నియమించి, ఆ తర్వాత జీహెచ్ఎంసీకి బదిలీ చేశారని పేర్కొన్నారు. తమకు కావాల్సిన వారికి నచ్చిన చోట పోస్టింగ్లు ఇవ్వడం కోసం అధికారులను వెంటవెంటనే బదిలీ చేశారని ఆరోపించారు. సీఈవోల బదిలీల్లోనూ ఇదే వ్యవహారం నడిచిందని విమర్శించారు. కొందరికి అర్హతకు మించి పోస్టింగ్ ఇచ్చారని తెలిపారు.
వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్లు, వర్క్ ఆర్డర్లను రద్దు చేస్తూ ఈ నెల మొదటివారంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో అందరూ సొంత ప్రాంతాలకు వెళ్లి రిపోర్ట్ చేయాలని హెచ్వోడీలు ఆదేశించారు. ఒక్కరోజు కూడా గడువకుండానే మాట మార్చేశారు. అవసరం ఉన్నచోట జిల్లా పరిధిలో డిప్యుటేషన్లు ఇచ్చుకోవచ్చంటూ కలెక్టర్లకు సూచనలు జారీచేశారు. ఈ ఆర్డర్ అనేక జిల్లాల్లో డీఎంహెచ్వోలకు, సూపరింటెండెంట్లకు వరంగా మారింది. కావాల్సిన వారికి, డబ్బులు ముట్టజెప్పినవారికి ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్ ఇస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రస్థాయి డిప్యుటేషన్లలో దందా నడుస్తున్నదని వైద్యవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇటీవలే వైరల్ అయిన ఓ ఆడియోలో ఏకంగా ఉన్నతాధికారికి లంచం ఇచ్చినట్టు ఉద్యోగిని స్పష్టంగా చెప్పింది. ఓ జిల్లా డీఎంహెచ్వోపైనా తీవ్ర ఆరోపణలు చేసింది. డబ్బులు ఇస్తేనే పని అవుతున్నదని, కేవలం రిలీవింగ్ లెటర్కే రూ.30 వేలు వసూలు చేస్తున్నారని అందులో ఉన్నది. ఈ విషయం సీఎం వరకు వెళ్లినట్టు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు నిజానిజాలు తేల్చకుండానే ఆ ఉద్యోగినిని సస్పెండ్ చేశారు. ఇక వైద్యశాఖలోని మరో విభాగంలో గతంలోనే వైద్యుల పోస్టింగ్కు సంబంధించి కౌన్సెలింగ్ పూర్తికాగా, కోర్టు కేసు కారణంగా నియామకపత్రాల జారీ ఆగిపోయింది. గత నెల నియామక పత్రాలు అందజేయగా.. అందులో 16 మంది డాక్టర్లకు కౌన్సెలింగ్ సమయంలో ఇచ్చిన ఆప్షన్ కాకుండా కొత్త స్థానంలో పోస్టిం గ్ వచ్చింది. దీని వెనుక రూ.లక్షల్లో చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన దవాఖానలతోపాటు మారుమూల ప్రాంతాల్లోనూ వైద్యులు, నర్సుల కొరత వేధిస్తున్నది. కోఠిలోని డీపీహె చ్, టీవీవీపీ, డీఎంఈ ఆఫీసుల్లో డిప్యుటేషన్పై వచ్చినవారు వెనక్కి వెళ్లడంతో పనులు పెండింగ్లో పడిపోయాయి. ఆ స్థానాల్లో తమకు నచ్చినవారిని, తమకు ‘ఇచ్చిన’వారిని నియమించుకునేందుకు కొందరు అధికారులు ప్ర యత్నిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నారు.
పోలీస్ శాఖలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. డీఎస్పీల బదిలీల్లో మళ్లీమళ్లీ పోస్టింగ్ ఆర్డర్లు మార్చేశారు. జిల్లాల స్థాయిలో ఒక్కటి రెండు కాదు.. పదుల సంఖ్యలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్లను బదిలీ చేశారు. సమర్థుల పేరుతో కొంతమందిని, సుదీర్ఘకాలంగా లూప్లైన్లో ఉన్నవారికి అవకాశం పేరుతో మరికొంత మందిని బదిలీ చేశారు. వీటి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఉపాధ్యాయుల బదిలీలంటేనే భయపడిపోయేవి. అందువల్ల ఉపాధ్యాయులకు బదిలీలు, డిప్యూటేషన్లు ఇచ్చేందుకు వెనుకాముందు ఆలోచించేవాళ్లు. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చాక విద్యాశాఖలో ఆన్డ్యూటీలు, డిప్యుటేషన్లు భారీగానే ఇచ్చారు. కాంగ్రెస్ నేత చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న భార్యనే ఒక ఉదాహరణ. ఒక్క నెలలోనే 50 మందికిపైగా ఉపాధ్యాయులకు డిప్యుటేషన్లు ఇచ్చినట్టు ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దీంట్లో ఒకరిద్దరు కీలక అధికారులు తలదూర్చారు. వాళ్లు సీఎం ఆదేశాలున్నాయని చెప్పి వర్క్ ఆర్డర్లు ఇచ్చేశారు. జీతం పాత స్కూల్లోనే డ్రా చేసేలా.. ఉద్యోగం మాత్రం తాము కోరుకున్న స్కూల్లో/ ఆఫీసులో చేసేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ విషయం తొలుత పత్రికల్లో రావడం, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ, అప్పటికే 50 మందికిపైగా ఉత్తర్వులు ఇచ్చేశారు. అక్రమంగా ఇచ్చిన ప్రతీ ఉత్తర్వును రద్దు చేయాలన్న డిమాండ్ వస్తున్నది.