హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మహిళా బిల్లు చారిత్రక అవసరమని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని కోరారు. మహిళా బిల్లు సాధన కోసం కేంద్రంపై అన్ని రాజకీయపక్షాలు ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో మంగళవారం జరిగిన బీసీ దళ్ సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ.. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటానికి ఇప్పటికే మంచి మద్దతు లభిస్తున్నదని చెప్పారు. సమావేశంలో బీసీ దళ్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు రుబిన్గౌడ్ పలువురు యువ నాయకులు పాల్గొన్నారు.