చర్ల, మార్చి 9: ఇద్దరినీ ప్రేమించాడు. ఇద్దరితో సహజీవనం చేశాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. చివరికి ఇద్దరు యువతులను ఒకే ముహూర్తానికి పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామం వేదికైంది. ఈ వివాహ కార్యక్రమం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చర్ల మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడకం సత్తిబాబు ఇదే మండలంలోని దోసిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారి, కుర్నపల్లికి చెందిన సునీతతో ప్రేమాయణం సాగించాడు. ఇద్దరితో సహజీవనం చేశాడు. స్వప్నకుమారికి పాప, సునీతకు బాబు పుట్టారు. పెండ్లి విషయంలో స్వప్నకుమారి, సునీతకు మధ్య చర్చ జరిగింది. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.
ఈ పంచాయితీలో సత్తిబాబు ఇద్దరినీ ప్రేమించానని, తాను ఇద్దరినీ పెండ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు. ఆ తర్వాత సత్తిబాబు, సునీత, స్వప్నకుమారి చర్చించుకున్నారు. సత్తిబాబు నిర్ణయాన్ని ఇద్దరూ అంగీకరించారు. అనుకున్నదే తడవుగా పెండ్లి పత్రికలు అచ్చు వేయించారు. బంధువులను ఆహ్వానించారు. గురువారం ఉదయం పెండ్లి జరగాల్సి ఉండగా సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయింది. దీంతో కంగారు పడిన వరుడు, వధువుల కుటుంబ సభ్యులు అప్రమత్తమై బుధవారం రాత్రే వివాహం జరిపించారు. సత్తిబాబు పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో స్వప్నకుమారి, సునీత మెడలో తాళిబొట్టు కట్టి ఇద్దరు భార్యలకు భర్త అయ్యాడు.