హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యారంగాన్ని సంస్కరిస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. నూతన విద్యావిధానం రూపకల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నది. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అధ్యక్షతన 2025 ఆగస్టు 29న కమిటీని నియమించింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, విద్యాకమిషన్ చైర్మన్గా వ్యవహరించిన ఆకునూరి మురళి, అప్పట్లో సీఎస్గా ఉన్న కే రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సభ్యులుగా, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా సభ్య కన్వీనర్గా కమిటీని నియమించింది. చైర్మన్ అభీష్టం మేరకు ఇతర సభ్యులను నియమించుకొనే అవకాశం కల్పించింది. 2025 అక్టోబర్ 30లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ గడువు ముగిసింది. ఈ కమిటీని నియమించి 2026 ఆగస్టు 29కి ఏడాది పూర్తయ్యింది. రానున్న అక్టోబర్ 30తో గడువుకు కూడా ఏడాది పూర్తవుతుంది. ఇంతవరకూ నివేదిక సిద్ధం కాలేదు.
ఈ ఏడాది ఏప్రిల్లో నివేదికను సర్కార్కు సమర్పిస్తామని, జూన్ నుంచి కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి తెస్తామని గతంలో కేశవరావు మీడియా సమావేశంలో చెప్పారు. ఏప్రిల్ పోయింది. జూన్ కూడా పోయింది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచిపోయింది. అయినా కొత్త విద్యా విధానంపై స్పష్టత లేదు. నివేదిక ఎప్పుడు సిద్ధమవుతుంది? ఎప్పుడు అమల్లోకి వస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం లభించడంలేదు. మరో ఏడాది గడిస్తే ఎన్నికల వాతావరణం మొదలవుతుంది. ఈ తరుణంలో తెలంగాణకు నూతన విద్యావిధానం ఎండమావిగానే మిగలనున్నది.
రాష్ట్రంలో విద్యారంగాన్ని సంస్కరిస్తామన్న సర్కార్.. ఎడ్యుకేషన్ కమిషన్ భవిష్యత్తును కూడా ప్రశ్నార్ధకంగా మార్చింది. విద్యాకమిషన్ ఉన్నట్టా? లేనట్టా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఆకునూరి మురళి చైర్మన్గా కమిషన్ను ఏర్పాటు చేసింది. 2024 సెప్టెంబర్ 6న జీవో జారీచేసింది. ఆ తర్వాత 2025 అక్టోబర్ 18న ముగ్గురు కమిషన్ సభ్యులతోపాటు ఆరుగురితో అడ్వైజరీ కమిటీని నియమించింది. అధ్యయనం పూర్తిచేసిన విద్యాకమిషన్ దశల వారీగా సర్కార్కు తొమ్మిది నివేదికలు సమర్పించింది. చివరగా తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ పేరిట ఓ నివేదికను సమర్పించిన ఆకునూరి మురళి తనకు అప్పగించిన పని పూర్తయ్యిందంటూ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి విద్యాకమిషన్ చైర్మన్ లేకుండానే నడుస్తున్నది. కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే కమిషన్లో మిగిలారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6తో కమిషన్ చైర్మన్ గడువు పూర్తయ్యింది.
చైర్మన్ వైదొలగగానే కమిషన్ సభ్యులు కూడా వైదొలగాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. మొత్తంగా రాష్ట్రంలో విద్యాకమిషన్ రద్దు అయినట్టే లెక్క. కొత్త కమిషన్ను నియమిస్తారా? లేదా? అన్నది తేలడంలేదు. ఇప్పటికే కమిషన్ సర్పించిన నివేదికలపై ప్రభుత్వం ఏంచేసిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యా విధానంపై స్పష్టత ఇవ్వాల్సిన తరుణంలో కమిటీలు, కమిషన్లు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారడం గమనార్హం. విద్యారంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటితో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇంతకాలం సర్కార్కు వంతపాడిన ఆకునూరి మురళి తాజాగా సర్కార్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. తెలంగాణ పీపుల్స్ఫ్రంట్ పేరిట రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం (నేడు), సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం హైదరాబాద్తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా హన్వాడాలో 8.59 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జడ్చర్లలో 5.86 సెం.మీ, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 5.84సెం.మీ, వేమన్పల్లిలో 5 సెం.మీ, మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండలో 4.73 సెం.మీ. వర్షపాతం రికార్డు అయ్యింది.
రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. శనివారం కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల కమిషనర్లు, పోలీసు కమిషనరేట్ల పరిధిలోని అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.