హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టం అమలుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జంతువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు 18 చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. బక్రీద్ నేపథ్యంలో పాతబస్తీలో గోవులను అక్రమంగా నిర్బంధించారని, వాటిని స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలంటూ యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కే శివకుమార్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
బక్రీద్కు కొన్ని రోజుల ముందు లేఖ రాసి ఉత్తర్వులు ఇవాలంటే ఎలా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంలతో కూడిన ధర్మాసం పిటిషనర్ను ప్రశ్నించింది. రాజ్యాంగంలోని అధికరణ 48 ప్రకారం గోవధ, జంతుహింస నిషేధానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను తీసుకువచ్చాయని పేర్కొన్నది. వీటిని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని కోర్టు ఆదేశించింది.