Wanaparthy | వనపర్తి, మార్చి 5: వనపర్తి జిల్లాలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గణపసముద్రాన్ని రిజర్వాయర్గా మార్చేందుకు రూ.55 కోట్లు, గోపాల్పేట మండలం బుద్ధారం చెరువును రిజర్వాయర్గా మార్చేందుకు రూ.42.2 కోట్లు మంజూరుచేసింది. ఈ మేరకు ఆదివారం జీవో జారీచేసింది. గణప సముద్రం కింద 10 వేల ఎకరాలు, బుద్ధారం చెరువు కింద 31,038 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ రెండు చెరువులు రిజర్వాయర్లుగా మారితే రాబోయే రోజుల్లో సాగునీటికి ఢోకా ఉండదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తానని మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఖిల్లాఘణపురంలోని గణప సముద్రాన్ని కృష్ణా నీటితో నింపారు. 36 ఏండ్ల తర్వాత చెరువు జలకళను సంతరించుకొని ఐదేండ్లుగా ఎండాకాలంలో సైతం అలుగు పారుతున్నది. చెరువు సామర్థ్యాన్ని పెంచేందుకు రిజర్వాయర్గా నిర్మించాలని భావించి మంత్రి సఫలీకృతులయ్యారు.