హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) పాటు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. తాజాగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు(SRSP) వరద ఉధృతి(Huge Flood) కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి భారీగా గోదావరి ప్రవాహం వస్తుండడంతో ఇన్ ఫ్లో కంటే ఔట్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో 41 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 1,75,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 2,70,000 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది.
శ్రీరామ్ సాగర్లో(Sriram sagar) 80.5 టీఎంసీల పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి ప్రస్తుతం 70 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.