కొండపాక, నవంబర్ 17: దేశ విదేశాల్లో సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక లోని ఆనంద నిలయం ఆవరణలో సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యసాయి సంజీవని చిన్నపిల్లల గుండె చికిత్స పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గురువారం ఈ కేంద్రాన్ని సద్గురు మధుసూదన్ సాయి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి మంత్రి ప్రారంభించారు.
గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యసేవలు అందించనున్న ఈ కేంద్రం దక్షిణ భారతదేశంలోనే మొదటిదని పేర్కొన్నారు. సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. రూ.50 కోట్లతో 100 పడకలతో అధునాతనమైన దవాఖానను సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడంపై మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో సత్యసాయి ట్రస్ట్ తనదైన శైలిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని కొనియాడారు.
గ్రామీ ణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సత్యసాయి ట్రస్ట్ పౌష్టికాహారాన్ని అందిస్తున్నదని మంత్రి తెలిపారు. కొండపాకలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాలయం, వైద్యాలయం, ఆనంద నిలయం ఏర్పాటుకు కృషిచేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి హరీశ్రావు కోరిక మేరకు సిద్దిపేట జిల్లాలో ఈ దవాఖాన నిర్మించామని సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధి సద్గురు మధుసూదన సాయి తెలిపారు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీశ్రావును, ఆనందా చారిటబుల్ ట్రస్టు ద్వారా సత్యసాయి ట్రస్టుకు భూమి సమకూర్చిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని ఆయ న అభినందించారు. ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడాలన్నారు.
సంజీవని దవాఖానలను సద్వినియోగం చేసుకునేలా గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. అనంతరం మంత్రి హరీశ్రావు, కేవీ రమణాచారిని సద్గురు మధుసూదన సాయి సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.