Data science | డిగ్రీలోని డాటా సైన్స్ కోర్సును పీజీలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నది. వీలైనంత త్వరగా ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నత విద్యామండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ డాటాసైన్స్ కోర్సును కొత్తగా 2020 – 21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆరు యూనివర్సిటీల పరిధిలోని 124 కాలేజీల్లో ఈ కోర్సును అమలుచేశారు. అప్పుడు 6,780 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
గత ఏడాది కూడా ఈ కోర్సులో గణనీయంగా విద్యార్థులు చేరారు. 2020- 21 బ్యాచ్ విద్యార్థులు ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పూర్తిచేసుకోనున్నారు. వీరంతా పోస్ట్గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరాల్సి ఉండగా, ఎమ్మెస్సీ డాటా సైన్స్ కోర్సు రాష్ట్రంలో ఏ వర్సిటీలో లేదు. ఈ నేపథ్యంలోనే ఉన్నత విద్యామండలి అధికారులు ఈ కోర్సును అందుబాటులోకి తెచ్చే అంశంపై చర్చిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు సిలబస్ను, కరిక్యులాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఫ్యాకల్టీని కూడా నియమించాలి. ఇందుకు కాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి. అయితే, దీనిపై రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకొంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.