హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో అమలుచేస్తున్న రూ.5కే అన్నపూర్ణ భోజనం పథకం పది కోట్ల మైలురాయిని దాటింది. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 10,11,10,852ల మంది అన్నార్తులకు కడుపు నిండా భోజనం పెట్టింది. ఏ ఒకరూ ఆకలితో అలమటించవద్దన్న సీఎం కేసీఆర్ సంకల్పం, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో 2014లో జీహెచ్ఎంసీ ప్రారంభించిన ఈ పథకం దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది. నిరుపేదలు, వలస కార్మికులు, విద్యార్థులు, బ్యాచిలర్లు, చిరుద్యోగులు.. ఇలా పలు రంగాలకు చెందినవారికి వరప్రసాదంగా మారింది. ప్రస్తుతం 373 కేంద్రాల్లో అన్నపూర్ణ భోజనం లభిస్తున్నది. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.192 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ప్రైవేట్ హోటళ్లకు దీటుగా 32 ప్రాంతాల్లో అన్నపూర్ణ భోజన కేంద్రాల్లో సీటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఆయా కేంద్రాల్లో టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, వాష్బేసిన్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. ఒక్కో కేంద్రంలో సౌకర్యాల కల్పనం కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారు.