హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 82.17 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు హవా కొనసాగించారు. పాలిసెట్లో 78.62 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 17న ప్రవేశ పరీక్షను నిర్వహించారు. 1,05,742 దరఖాస్తులు రాగా, 98,274 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంపీసీ విభాగంలో 80,358, ఎంబైపీసీ విభాగంలో 80,752 విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
సూర్యాపేట జిల్లాకు చెందిన సురభి శరణ్య 120 మార్కులకు 119 మార్కులు సాధించి ఎంపీసీ విభాగంలో స్టేట్ టాపర్గా నిలిచింది. అదే జిల్లాకు చెందిన షేక్ అబూబాకర్ సిద్ధిక్ 119 మార్కులు సాధించి రెండో ర్యాంకు, మెదక్ జిల్లాకు చెందిన జీ ప్రియాంశ్కుమార్, హైదరాబాద్కు చెందిన పీ ప్రణీత్, సూర్యాపేటకు చెందిన కే శశివర్ధన్ 118 మార్కులతో మూడో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల ఆకాశ్ 116 మార్కులు సాధించి టాప్ ర్యాంకర్గా నిలిచాడు., సూర్యాపేట జిల్లా విద్యార్థి మిర్యాల అక్షయతార 116 మార్కులతో రెండు, సూర్యాపేట జిల్లాకే చెందిన కే శశివర్ధన్ 116 మార్కులతో మూడో ర్యాంకును సొంతం చేసుకున్నారు. శశివర్ధన్ ఎంపీసీ, ఎంబైపీసీ రెండింటిలోనూ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకును సొంతం చేసుకోవడం విశేషం. ఈ ఏడాది ప్రవేశాలకు జూన్ 14 నుంచి మొదటి విడత, జూలై 1 నుంచి తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 7 నుంచి 14 వరకు ఓరియంటేషన్ నిర్వహించి, జూలై 15 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభిస్తారు.
పాలిసెట్ కోసం చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యా. సెలవుల్లోనూ ప్రైవేట్ క్లాసులకు హాజరయ్యా. టీచర్లు నన్ను ఎంతో ప్రోత్సహించారు. మా అమ్మ నాన్న సైతం పాలిసెట్ రాయమని ఎంకరేజ్ చేశారు. తప్పులను సవరించారు. ఉన్నత చదువులు చదివి ఐఐటీల్లో చేరాలన్నది నా లక్ష్యం. ఐఐటీ చదువు పూర్తయ్యాక సివిల్స్ రాసి ఐఏఎస్నవుతా.
– సురభి శరణ్య, స్టేట్ ఫస్ట్ ర్యాంకు (ఎంపీసీ)
ఐఐటీహెచ్లో చదువుతా..
మా నాన్న రైతు. ఉన్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. పాలిసెట్ ఎగ్జామ్ బాగా రాశా. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ముందే ఊహించా. జేఈఈ రాసి ఐఐటీ హైదరాబాద్లో చదవాలన్నది నా లక్ష్యం. ఐఐటీలో కంప్యూటర్సైన్స్ ఇంజినీరింగ్లో చేరి ఉన్నతస్థాయికి ఎదగాలని అనుకుంటున్నా.
– చీర్ల ఆకాశ్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ (ఎంబైపీసీ)