మార్చి 28న సుందిళ్ల బరాజ్లో 1.75 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. ప్రభుత్వం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలింది. అసలే మాడు పగిలే ఎండలు. పైగా ఒట్టిపోయిన గోదావరి. వదిలిన నీళ్లు సగం ఇసుకలోకి పోతే, మరో సగం ఆవిరైపోయాయి. ఇంత దారుణం ఏమిటని మంథని నియోజకవర్గ రైతులు ఓ ప్రజాప్రతినిధి దగ్గర వాపోయారు. వెంటనే ఆయన సదరు ఇంజినీర్లకు ఫోన్ చేయడంతో ఆగమేఘాలపై గేట్లు మూసివేశారు. అప్పటికే 4 గంటల పాటు నీటి విడుదలతో 0.75 టీఎంసీలు ఎటూ కాకుండా పోయాయి.
ఒకవైపు రాష్ట్రం తాగు, సాగునీటి సంక్షోభంలో చిక్కుకున్నది. కరువు కష్టాలను తప్పించుకొనేందుకు ప్రాణహిత నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితిలో ప్రభుత్వం సుందిళ్ల గేట్లు ఎందుకు ఎత్తినట్టు? ఎందుకు మూసివేసినట్టు? గోదావరి బేసిన్లోనే కాదు.. కృష్ణా బేసిన్లోనూ ఇదే దుస్థితి. ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలను ఎలా వినియోగించాలో తెలియక కాంగ్రెస్ సర్కారు తికమకపడుతున్నది. రైతులనూ ఆగమాగం చేస్తున్నది. ఉన్న నీటి నిల్వలను సోయి లేకుండా వృథా చేసింది. లక్షల మంది రైతులను అరిగోస పెడుతున్నది.
Irrigation Projects | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది? అన్న ప్రశ్నకు సుందిళ్ల పరిణామమే పెద్ద ఉదాహరణ. అసలు బరాజ్లోని నీటిని ఎందుకు ఖాళీ చేయాలనుకున్నారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఆదేశానుసారమే బరాజ్ను ఖాళీ చేశారని ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ అసలు అథారిటీ ఇంజినీర్లు ఎప్పుడు చెప్పారు? అనేది ఒక ప్రశ్న. మేడిగడ్డ ఘటనపై కమిటీ ఏర్పాటైన తర్వాత గత నెల 6న తొలిసారిగా కమిటీ చైర్మన్, సభ్యులు తెలంగాణకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్లను పరిశీలించి, వెళ్లారు. ఒకవేళ అప్పుడే బరాజ్లను ఖాళీ చేయాలని ఆదేశించి ఉంటే, నిన్నటిదాకా ఎందుకు నీటిని వదల్లేదనేది ఇంకో ప్రశ్న.
రెండో దఫాగా కమిటీ గత నెల 19-21 తేదీల్లో హైదరాబాద్కు వచ్చి జలసౌధలో విచారణ చేపట్టింది. కానీ ఆ సందర్భంగా బరాజ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు లేదు. అలాంటి ఆదేశాలు వచ్చినట్టు ఇంజినీర్లు కూడా చెప్పలేదు. సరే! కమిటీ ఆదేశించింది అనుకున్నా.. వారం పాటు గేట్లు ఎత్తకుండా, 28వ తేదీనే ఎందుకు ఎత్తారు? అనేది మరో ప్రశ్న. వాస్తవానికి ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చేదాకా కాళేశ్వరం మోటర్లు నడిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం భీష్మించుకొని కూర్చున్నది. తాము ఇంజినీర్లు కాదు.. నిపుణుల సూచన మేరకే నడుచుకుంటామని సీఎం రేవంత్ సహా మంత్రులు చెప్తూ వచ్చారు. ఒకవేళ ఎన్డీఎస్ఏ కమిటీ ఆదేశాల ప్రకారమే నీటిని విడుదల చేస్తే.. ప్రజాప్రతినిధి ఫోన్ చేయగానే ఎందుకు నీటి విడుదల ఆపేసినట్టు? అన్నది అసలైన ప్రశ్న. ఇన్ని అనుమానాల మధ్య రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ ఇంజినీర్ల ప్రణాళిక ప్రకారం అమలవుతున్నదా? లేక మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్కాల్స్పై గేట్లు తెరవడం, మూయడం జరుగుతున్నదా? అన్న కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి రిజర్వాయర్ కింది ఆయకట్టు రైతుల్లో ఈ ఏడాది అంతులేని విషాదం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకంతో వేల ఎకరాల్లో పంట నష్టపోయిన దుస్థితి. అనంతగిరి రిజర్వాయర్కు అల్లీపూర్, అనంతారం వైపుగా రెండు ఫ్రీ ఫ్లో గేట్లు ఉన్నాయి. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.5 టీఎంసీలు. రిజర్వాయర్ పూర్తిగా నిండిన సమయంలో ఆ ఫ్రీ ఫ్లో గేట్ల ద్వారా దిగువన ఒకవైపు రేపాక పెద్దచెరువు, మరోవైపు అనంతారం చెరువు అక్కడి నుంచి రహీంఖాన్పేట చెరువు ఇలా గొలుసుకట్టు చెరువులకు నీళ్లు వదిలేవారు. అదేవిధంగా బిక్కవాగులోకి నీటిని వదిలిపెట్టేవారు. తద్వారా వాగు చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల్లో, గొలుసు కట్టు చెరువుల కింద వేల ఎకరాల్లో పంటలు సాగయ్యేవి.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి దాదాపు ఐదేండ్లుగా రెండు పంటలకు పూర్తి భరోసా లభించింది. కానీ ఈ ఏడాది కాళేశ్వరం ఎత్తిపోతలు లేవంటూ సర్కారు చెరువులను నింపలేదు. కాంగ్రెస్ అధికారం చేపట్టేనాటికి మధ్యమానేరులో 18 టీఎంసీలకుపైగా నీళ్లు ఉన్నాయి. అన్నపూర్ణ పంప్హౌజ్లో కూడా 2.5 టీఎంసీల జలాలు ఉన్నాయి. మధ్యమానేరు జలాశయం నుంచి అదనంగా 1 టీఎంసీని ఎత్తిపోస్తే ఫ్రీ ఫ్లో గేట్లు పనిచేసేవి. కొద్ది మొత్తంలో నీటిని విడుదల చేసి చెరువులను నింపితే ఇప్పుడు అక్కడ పంటలు ఎండిపోవాల్సిన దుస్థితి వచ్చేది కాదు. కానీ ప్రభుత్వం ఆ పనిచేయలేదు. అన్నపూర్ణలో ఉన్న జలాలను రంగనాయకసాగర్కు తరలించింది. వెరసి ఇప్పుడు అన్నపూర్ణలో 0.87 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక మధ్యమానేరులో ఇప్పుడు 7.7 టీఎంసీల జలాలు ఉండగా, అందులో ఎస్సారెస్పీ ఆయకట్టు కోసం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం అవగాహనరాహిత్యంతో అనంతగిరి కింది ఆయకట్టు ఎండిపోతున్న దుస్థితి.
ఎస్సారెస్పీ కాల్వల నిర్వహణపైనా ప్రభుత్వానికి అవగాహన లేదని తెలిసిపోతున్నది. వాస్తవంగా ఎస్సారెస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 కింద దాదాపు 13 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నది. ఎస్సారెస్పీ కాలువల కింద కాకుండా ఆ కమాండ్ ఏరియాలో భూగర్భ జలాల ఆధారంగా అదనంగా 5 లక్షల ఎకరాలకు పైగా సాగు అవుతుంది. మొత్తంగా 20 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు సాగు అయ్యేది. కాల్వలకు వాటి సామర్థ్యం మేరకు సమృద్ధిగా నీరు అందించినప్పుడే కమాండ్ ఏరియాలో భూగర్భ జలాలు నిలకడగా ఉండి పంటలు సాగయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాలువల కింది ఆయకట్టుకు సైతం పుష్కలంగా నీరందే పరిస్థితి ఉంటుంది.
కాళేశ్వరం అందుబాటులోకి వచ్చాక ఈ 20 లక్షల ఆయకట్టుకు పూర్తి భరోసా లభించింది. కానీ ఈ ఏడాది ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపేయడంతో ఆయకట్టు మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన అనంతరం ఎస్సారెస్పీ నీటిని ఎల్ఎండీ ఎగువకే పరిమితం చేశారు. ఎల్ఎండీ దిగువకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన జలాలనే తరలించేవారు. దాంతో నీటి కొరత ఉండేది కాదు. చివరి మడికి సైతం తడి తాకింది. కాంగ్రెస్ సర్కారు మాత్రం కాళేశ్వరం ఘనతను చిన్నగా చూపాలన్న ప్రయత్నంలో కాళేశ్వరం లేకున్నా ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సైతం నీళ్లు ఇస్తామని చెప్పుకొచ్చింది.
కానీ ఆచరణలో మాత్రం బొక్కబోర్లా పడింది. కాంగ్రెస్ అధికారం చేపట్టేనాటికి ఎల్ఎండీ, ఎస్సారెస్పీ, ఎంఎండీలో కలిపి 100 టీఎంసీలకు పైగా నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆ నీళ్లను ఎంత పొదుపుగా వాడుకున్నా గరిష్ఠంగా 12 లక్షలకు మించి ఆయకట్టుకు ఇవ్వలేమన్నది అధికారుల మాట. అయినా నిజాలు దాచి స్టేజ్-2 కూడా ఇస్తున్నామని చెప్పి పెన్పహాడ్ వరకు నీటిని విడుదల చేసింది. అయితే నీటి పొదుపు పేరుతో కాల్వలకు నిర్దేశిత సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయకపోవటంతో రైతులు ఎక్కడికక్కడ మోటర్లు పెట్టి తోడేయటం, ఎవరు ఒత్తిడి చేస్తే వారికి నీటిని విడుదల చేయడంతో సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు ట్రాన్స్మిషన్ నష్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. కమాండ్ ఏరియాలో భూగర్భ జలమట్టం పెరిగింది లేదు. వెరసి ఎస్సారెస్పీ ఆయకట్టులో 5 లక్షలకు మించి ఎకరాలు ఎండిపోయే దుస్థితి తలెత్తింది.
ఏప్రిల్ 4, గురువారం సాయంత్రం 6 గంటల సమ యంలో మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ వద్ద తీసిన ఫొటో ఇది.
ఈ సమయంలో కూడా లక్ష్మీ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి 1470 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. కొన్ని ఇసుక బస్తాలు అడ్డువేసో, చిన్న మట్టికట్టవేసో ఈ నీళ్లను పంప్ హౌజ్ వద్దకు తరలించవచ్చు. కరువు కోరల్లో చిక్కుకొని తాగునీటి కోసం, సాగునీటి కోసం విలవిలలాడుతున్న తెలంగాణ ప్రజానీకానికి అందించవచ్చు. ఇది ఇరిగేషన్ అధికారులు అనధికారికంగా చెప్తున్న నిజం.
నీటి నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని చెప్పడానికి ఎస్సారెస్పీ కాల్వలు, అన్నపూర్ణ రిజర్వాయర్, సుందిళ్ల బరాజ్ ఘటనలే ఉదాహరణలుగా నిలుస్తాయి. కమాండ్ ఏరియాలో నేల పొడిబారకముందే నీటిని విడుదల చేస్తే నీటి సరఫరా నష్టాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ పనిచేయకుండా భూగర్భజలాలు అడుగంటిన తర్వాత., కాల్వలు పొడిబారిన తర్వాత నీటిని విడుదల చేయటంతో ట్రాన్స్మిషన్ నష్టాలు విపరీతంగా పెరిగాయని రైతులు వివరిస్తున్నారు. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ లేదని నిప్పులు చెరుగుతున్నారు.