హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ చట్టం ఉన్నప్పటికీ, పొగరాయుళ్లు దానిని ఖాతరు చేయడం లేదు. దేశం మొత్తం మీద ఈ చట్టాన్ని కఠినంగా అమలుచేయడంలో, బహిరంగ ప్రదేశాల్లో దమ్ము కొట్టేవారిపై జరిమానాలు విధించడంలో కర్ణాటక, కేరళ రాష్ర్టాలు ముందున్నాయి. తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. గత మూడేండ్లలో దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ చేస్తున్న 14.40 లక్షల మంది నుంచి జరిమానాలు వసూలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సగటున రోజుకు 1,200 మంది జరిమానాలు చెల్లిస్తున్నారు.
మొత్తం జరిమానాల్లో సగం కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లోనే ఉండటం విశేషం. గత మూడేండ్లలో తెలంగాణలో 48,379 మందికి జరిమానాలు విధించగా, ఆంధ్రప్రదేశ్లో 11 మందికే జరిమానాలు పడ్డాయి. ధూమపానం, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2003లో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ (సీవోటీపీఏ) చట్టాన్ని తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే, పొగాకు ఉత్పత్తుల రవాణా, విక్రయాలు చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానాలు విధించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. చాలా రాష్ర్టాలు ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం లేదు. జరిమానాలు, శిక్షలు వేయడం కంటితుడుపు చర్యగా మారింది. అందుకే చాలా రాష్ర్టాల్లో కేసుల నమోదు, జరిమానా వసూలు తక్కువగా ఉంటున్నాయి.