హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా జరుగుతున్న నోటీసుల పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 92.88 లక్షల మంది ఓటర్లకు నోటీసులు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 31.74 లక్షలు (34 శాతం) మాత్రమే పంపిణీ అయ్యాయి. వీటిలో 1.94 లక్షల (2 శాతం) నోటీసులపై మాత్రమే విచారణ పూర్తయినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి మంగళవారం ప్రకటించారు. మిగిలిన నోటీసులను దశలవారీగా ఓటర్లకు అందజేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా 1,973 ఏఈఆర్వోలు, 119 ఈఆర్వోలు ఈ ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు.
ముసాయిదా ఓటరు జాబితాలను సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) కార్యాలయాలతోపాటు సీఈవో వెబ్సైట్ (https:// ceotelangana.nic.in)లోనూ అందుబాటులో ఉంచామని, వీటిపై సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిషార ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని, ఇప్పటివరకు మొత్తం 9,07,292 క్లెయిమ్స్, అభ్యంతరాలు అందాయని వివరించారు. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెల 5, 6, 12, 13న పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.