PG Admissions | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగా ణ): పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాల నిబంధనలను ఏటా సడలిస్తున్న అధికారులు తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు. ఆరు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు డిగ్రీలో కెమిస్ట్రీ ఉండాలన్న నిబంధనను సీపీగెట్ అధికారులు తాజాగా ఎత్తేశారు. మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంట్ సైన్స్, బయో కెమిస్ట్రీ, న్యూట్రిషన్, డైటెటిక్స్ ప్రోగ్రామ్ కోర్సుల్లో ప్రవేశానికి కెమిస్ట్రీని చదివి ఉండాలన్న నిబంధనను తొలగించారు. ఈ నిర్ణయంతో బీఎస్సీ బీజెడ్సీ, మైక్రోబయాలజీ, బయాలజీ, జువాలజీ వంటి కాంబినేషన్తో డిగ్రీ పూర్తిచేసిన వారు పైన పేర్కొన్న ఆరు సబ్జెక్టుల్లో చేరవచ్చు. తాజాగా డిగ్రీలో ఏ కోర్సు తీసుకున్న వారైనా ఎంకామ్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎంకాం ఎంట్రెన్స్లో ప్రతిభ సాధించాల్సి ఉంటుంది.
వచ్చే విద్యాసంవత్సరంలో వివిధ యూనివర్సిటీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. కొత్తగా నిజాం కళాశాలలో పీజీ స్థాయిలో ఫెర్మెంటేషన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్ట గా, నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీ లో ఎంఏ హిస్టరీ, ఎంఏ టూరి జం, ఎంఏ సైకాలజీ కోర్సులను ప్రవేశపెట్టారు.
2023-24లో ప్రవేశాల కోసం సీపీగెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 300 కాలేజీల్లో అడ్మిషన్ల కోసం దాదాపు 45 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. సీపీగెట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. దాదాపు 50 సబ్జెక్టులకు జూన్ చివరి వారంలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.