హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో కొత్తగా బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ కోర్సును తెలంగాణ ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తేనున్నది. 2024-25 విద్యాసంవత్సరంలో ప్రాథమికంగా రాష్ట్రంలోని 20 అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రారంభిస్తారు. దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏలో హాస్పిటల్ మేనేజ్మెంట్ (బయో మెడికల్) కోర్సును కొన్ని వర్సిటీల్లో నిర్వహిస్తున్నారు.
ఇంజినీరింగ్లోనూ బయో మెడికల్ ఇంజినీరింగ్ కోర్సును నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ డిగ్రీలోను ఈ కోర్సును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. కోర్సు రూపకల్పన, కరికులం తయారీకి ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించి నిపుణులతో చర్చలు జరిపారు. బుధవారం మాసాబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిపుణులతో మరోమారు సమావేశం కానున్నారు.