హైదరాబాద్, ఫిబ్రవరి29 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ కుంగిన ఘటనపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మేడిగడ్డ బరాజ్ను పూర్తిస్థాయిలో పరిశీలించి లోపాలను గుర్తించడంతోపాటు, చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులకు సంబంధించి తగిన సిఫార్సులు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్ర జల్శక్తిశాఖను కోరింది.
ఈ నేపథ్యంలో ఎన్డీఎస్ఏ తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో కమిటీ వేసింది. కమిటీలోని మిగతా సాంకేతిక నిపుణుల పేర్లను శుక్రవారం వెల్లడించే అవకాశముంది. ఈ కమిటీ వారం రోజుల్లోగా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్లను సందర్శించడంతోపాటు ఆయా నివేదికలను పరిశీలిస్తుంది. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై నెల రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని కమిటీకి కేంద్రం నిర్దేశించినట్టు సమాచారం.