నారాయణపేట రూరల్, ఆగస్టు 21 : నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్లో భాగంగా నారాయణపేట జిల్లాలోని పేరపళ్ల శివారులో కోల్పోతున్న భూముల రీసర్వే ప్రారంభమైంది. పదిహేను రోజులుగా ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుసగా కథనాలు ప్రచురితమవుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్పందించి మళ్లా సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జాయమ్మ చెరువు పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల భూములకు సంబంధించి శుక్రవారం రీసర్వే ప్రారంభమైంది.
అధికారులు మూడు బృందాలుగా ఏర్పడగా.. ఒకో బృందంలో ఒక సర్వేయర్తోపాటు ఇద్దరు జీపీవోలు, ఒక ఆర్ఐ ఉన్నారు. సర్వేయర్ ధనవంతి ఆధ్వర్యంలోని బృందం 78వ సర్వే నంబర్ నుంచి.. సర్వేయర్ జయశంకర్ బృందం 55వ సర్వే నంబర్ నుంచి, సర్వేయర్ రాజయ్య బృందం 93వ సర్వే నంబర్ నుంచి ప్రక్రియ మొదలుపెట్టారు.
తొలిరోజు పలు ప్రాంతాల్లో శాటిలైట్ సిగ్నల్స్ సక్రమంగా అందకపోవడంతో సర్వేకు కొంత అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ అధికారులు ప్రక్రియ చేపట్టారు. భూములకు సంబంధించి ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలతో రీసర్వే ప్రారంభించడంతో రైతు లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సర్వే ద్వారా తమ భూ ముల హద్దులు, విస్తీర్ణం, చెరువు పరిధిలోకి వెళ్లిన భూముల వివరాలు స్పష్టమవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. నారాయణపేట తహసీల్దార్ అమరేందర్ కృష్ణ పర్యవేక్షణలో రీసర్వే కొనసాగింది.