హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పర్యావరణ హిత, సహజ రంగులతో హోలీ జరుపుకుందామని మున్సిపల్ శాఖ పిలుపునిచ్చింది. రసాయన, హానికరమైన రంగులు వాడకుండా పండుగ చేసుకుందామని సూచించింది. నగరాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచుకుందామని పేర్కొన్నది. ఈ మేరకు ప్రజలల్లో అవగాహన పెంచాలని, చైతన్యం తీసుకరావాలని మున్సిపల్ కమిషనర్లను సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. తక్కువ నీటిని ఉపయోగించేలా సహజ రంగులు వాడాలని సూచించారు. కండ్లు, ముక్కు, చెవుల్లోకి రంగులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొని, హోలీ ఆడాలని పేర్కొన్నారు. హోలీ ఆడేందుకు వెళ్లే ముందు తలకు నూనె రాసుకుంటే ఎక్కువగా రంగులు అంటుకోవని పేర్కొన్నారు.