BJP | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత బండి సంజయ్కు, రాష్ట్ర నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతున్నదా? బండిని కావాలనే అవమానిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఆయన వర్గీయులు అవుననే అంటున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం వచ్చింది. తీరా ఈటల మాత్రమే హాజరై బండి దూరం కావడం ఈ ఊహాగానాలకు తావిస్తున్నది. నేతలిద్దరూ కలిసి నిర్వహించాల్సిన ప్రెస్మీట్కు ఈటల మాత్రమే హాజరు కావడంతో బండి కావాలనే దూరమయ్యారని కొందరు నేతలు ఆరోపించారు.
ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే ప్రెస్మీట్ సమాచారమే తనకు లేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. మరోవైపు, సమన్వయ లోపంతోనే సమాచారం అందించలేకపోయామని చెప్తూ రాష్ట్రనాయకత్వం క్షమాపణలు కోరినట్టు సమాచారం. ఇది తెలిసి బండి వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బండిని బద్నాం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి దూరంపెట్టినట్టు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే సమాచారం ఇవ్వకుండా ఆపై అమిత్ షా చెప్పినా వినలేదంటూ బండిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.