హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుం బానికి చెందిన జమునా హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసైన్డ్ భూమిలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో సర్వే నం. 130లోని మొత్తం భూమిని 1995లోనే ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషాద్ చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారని గత మే 6, జూన్ 25న మాసాయిపేట ఎమ్మార్వో ఇచ్చిన నోటీసును జమునా హేచరీస్తోపాటు ఈటల భార్య జమున, కుమారుడు ఈటల నితిన్రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ ఎం సుధీర్ కుమార్ ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరఫున హరేందర్ వాదనలు వినిపిస్తూ 1995లో ల్యాండ్ సీలింగ్ భూమిగా నిర్ణయించిన ప్రభుత్వం, దానిని స్వాధీనం చేసుకొని నిరుపేదలకు అసైన్ చేసిందని తెలిపారు. అసైన్డ్ భూములను పిటిషనర్లు కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.
అసైన్డ్ భూ యజమానులను ప్రతివాదులుగా చేయకుండా రిట్ వేశారని గుర్తు చేశారు. ‘సర్వే నం.130లోని 18.35 ఎకరాల భూమి వివాదంలో 2017లో అప్పటి జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టి అందులో మూడు ఎకరాలు కే సత్యనారాయణరావు (తర్వాత సత్యనారాయణరావు నుంచి పిటిషనర్ ఈటల నితిన్రెడ్డి కొనుగోలు చేశారు) పేరిట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారని చెప్తున్న పిటిషనర్లు..
ఆ మూడు ఎకరాల ప్రొసీడింగ్స్ను ప్రశ్నించకుండా మొత్తం ప్రొసీడింగ్స్ను సవాల్ చేయడం చెల్లదు’ అని స్పష్టం చేశారు. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది డీ ప్రకాశ్రెడ్డి వాదిస్తూ, సత్యనారాయణరావు నుంచి నితిన్రెడ్డి 3 ఎకరాలు కొన్నారని, వాటికి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇరుపక్షాల వాదనల విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది.