హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వినియోగదారులు, ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, జార్ఖండ్ తదితర 13 రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ), తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసొసియేషన్ (టీఈఈఏ) కొనియాడాయి. కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సవరణ బిల్లును, వ్యవసాయ విద్యుత్తు మోటర్లకు అనవసరంగా మీటర్లు పెట్టాలన్న విధానాన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆ రెండు సంఘాలు ఆదివారం విడివిడిగా ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తేలేదని, తెలంగాణలో విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగుల కృషి వల్లనే నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయగలుగుతున్నామని సీఎం కేసీఆర్ పేర్కొంటూ సమాజంలో తమకు మంచి గుర్తింపును ఇవ్వడంపై టీఎస్పీఈఏ అధ్యక్షుడు పీ రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి పీ సదానందం, అసోసియేట్ ప్రెసిడెంట్ ఏ వెంకటనారాయణరెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి కే అంజయ్య తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో ఈ రంగాన్ని ప్రైవేటీకరించి బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. విద్యుత్తు రంగం మనుగడ కోసం కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు విద్యుత్తు ఇంజినీర్లు, ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని కేంద్రం కబళించాలని చూడటం సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమని టీఈఈఏ ధ్వజమెత్తింది. లాభాల్లో ఉన్న డిస్కంలను పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లోని ఆస్తులను తెగనమ్మాలని చూస్తున్న మోదీ సర్కార్పై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని టీఈఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ శివాజీ, రామేశ్వరయ్యశెట్టి, తుల్జారాంసింగ్, బందెల రవి, సురేందర్రెడ్డి శ్రవణ్కుమార్ గుప్తా, వెంకట్రామయ్య, నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.