హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఎంసెట్లో ఈ ఏడాది నుంచి కేవలం ఇంగ్లిష్ భాషలో కూడా ప్రశ్నాపత్రాన్ని ఇవ్వనున్నామని టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. ఇంతకుముందు తెలుగు/ఇంగ్లిష్, ఇంగ్లిష్/ఉర్దూ భాషల్లో ఎంసెట్ ప్రశ్నాపత్రాలు ఇచ్చేవారు. ఇకపై ఈ రెండింటితోపాటు కోరుకున్న విద్యార్థులకు ఒక్క ఇంగ్లిష్భాషలోనే క్వశ్చన్ పేపర్ ఇవ్వనున్నామని తెలిపారు. ఇందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకొనే సమయంలోనే ఈ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ గురువారం వెలువడనున్న నేపథ్యంలో ప్రొఫెసర్ గోవర్ధన్ నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల చేస్తున్నాం. 20వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. గతానికి భిన్నంగా ఈ ఏడాది అపరాధ రుసుము లేకుండా 60 రోజులపాటు దరఖాస్తులకు అవకాశమిచ్చాం. పరీక్షలు జూలై 5 – 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్లో జరుగుతాయి. పరీక్షలు మొత్తం 9 సెషన్లలో జరుగుతాయి. అగ్రికల్చర్ వారికి 3, ఇంజినీరింగ్ వారికి 5 సెషన్లు, మరో సెషన్ను అవసరాన్ని బట్టి నిర్వహించాలనుకుంటున్నాం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.
ఎస్సెస్సీ, ఇంటర్ సర్టిఫికెట్లలో ఏ పేరుంటే అదే పేరునుతోనే దరఖాస్తు చేయాలి. ముందుగా యూజర్ మాన్యువల్ను చదువాలి. కరోనా నేపథ్యంలో హాల్టికెట్లపై ఈ ఏడాది గెజిటెడ్ సంతకం అవసరంలేదు. ఈసారి ఈడబ్ల్యూఎస్ వారికి 10 శాతం రిజర్వేషన్ అమలుచేస్తున్న నేపథ్యంలో ఆ ఆప్షన్ ఇస్తున్నాం. ఈ కోటా వర్తించే అభ్యర్థులు ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్ ఆప్షన్ను ఎంచుకుంటేనే 50 శాతం ఫీజు మాఫీ వర్తిస్తుంది.
కరోనా నేపథ్యంలో అపరాధ రుసుములను 50 శాతం తగ్గించాం. విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్.. రెండింటికి కలిపి ఒకటిగా లేదంటే వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంసెట్ అప్డేట్ కోసం విద్యార్థులు eamcettsche.ac.in వెబ్సైట్ను తరుచూ సంప్రదించాలి. విద్యార్థులు ఏ బోర్డులో ఇంటర్ పూర్తిచేశారో అదే బోర్డును పేర్కొనాలి. ఈ ఆప్షన్పై విద్యార్థులకు అవగాహన లేక చాలామంది తప్పుగా నమోదుచేస్తున్నారు. ప్రతీ ఏటా 2వేల మంది పొరపాట్లు చేసి సవరించమని కోరుతున్నారు. దీని దృష్ట్యా మొదటికి తీసుకొచ్చాం.
పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఈసారి కొన్నింటికి మాత్రమే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నాం. కులం, పుట్టినతేదీ సహా వ్యక్తిగత వివరాలను సవరించుకోవడం ఎడిట్ ఆప్షన్ ద్వారా వీలుకాదు. ఇందుకు టీఎస్ఎంసెట్ మెయిల్ ఐడీకి తగు డాక్యుమెంట్లను జోడించి పంపిస్తేనే సవరిస్తాం. కాబట్టి దరఖాస్తు చేసేటప్పుడే పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలి. సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాత ఎంసెట్ ర్యాంకింగ్ మారుతుంది. ఇంటర్ మార్కుల వెయిటేజీని కలిపి తుది ర్యాంక్లను ప్రకటిస్తాం.