హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాజధాని నడిబొడ్డులో ఉన్న రూ. కోట్ల విలువైన ఆర్టీసీ భూములు తీసుకోవాలని చూస్తున్న సర్కార్ అందుకు బదులుగా ఆర్టీసీకి నగర శివారులో భూములు ఇస్తామని ప్రతిపాదించింది. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమిస్తాన్పూర్ ఆర్టీసీ క్వార్టర్స్కు చెందిన సుమారు 4 ఎకరాల స్థలాన్ని ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తున్నందుకుగాను ప్రభుత్వం సుమారు 80 ఎకరాల వరకు ఆర్టీసీకి ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని తీసుకుంటున్నప్పుడు.. అదే స్థాయిలో, అంతే విలువైన భూములు ఇవ్వాలనే డిమాండ్ను ప్రభుత్వం వద్ద పెట్టామని చెప్పారు. దీంతో శంషాబాద్ లేదా గాజులరామారం వద్ద సుమారు 80 ఎకరాల స్థలాన్ని ఆర్టీసీకి ఇచ్చేందుకు పరస్పర అంగీకారం కుదిరినట్టు చెప్పారు.
ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే, ఈ ప్రతిపాదన అంతా ప్రాథమిక దశలోనే ఉన్నదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం మొదట బస్ భవన్ పక్కన ఉన్న భూములు కావాలనే ప్రతిపాదన తమకు వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ భూములు వివాదాస్పదంగా ఉండటం, ఆ ఏరియా మొత్తం చాలా ఖరీదైన ప్రాంతం కావడం, ఆర్టీసీని విస్తరించే క్రమంలో ఆ స్థలం యాజమాన్యానికి చాలా అవసరమనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించామని, ఆ స్థలంలో ఇప్పటికే బస్బేలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నట్టు చెప్పారు. వివాదాలకు తావులేని ప్రాంతాలే కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో. జమిస్తాన్పూర్ ఓల్డ్ ఆర్టీసీ క్వార్టర్స్ స్థలాన్ని చూపించామని, దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు.
కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా స్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ భూముల్లో సుమారు 9.2 ఎకరాలు రైల్వేశాఖకు ఇచ్చినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. అందుకు ప్రతిగా కాచిగూడలో కొత్త బస్ స్టాండ్ను రైల్వేశాఖ కట్టించడంతో పాటు, చిలకలగూడలోని రైల్వేకు చెందిన సుమారు 9.2 ఎకరాలను ఆర్టీసీ ఇచ్చే ప్రతిపాదనపై అంగీకారం కుదిరిందని తెలిపారు. ఆర్టీసీ ల్యాండ్ స్వాప్ ప్రతిపాదన పూర్తవగా.. ఇటీవల ఆర్టీసీ, రైల్వేశాఖ అధికారులు ఆ స్థలాలను పరిశీలించారు. ఈ భూముల విషయంలో ఆర్టీసీ బోర్డు కూడా తుది నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు. ప్రభుత్వ అంగీకారం కూడా పూర్తయిందని, రైల్వే స్థలాల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. శంషాబాద్ లేదా గాజులరామారంలో ఇచ్చే ప్రభుత్వ భూమిలో ఇంటర్ స్టేట్ బస్ టర్మినల్, బస్ డిపో, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించే ఆలోచన ఉన్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్పారు.
ఆర్టీసీ స్థలాలను అటు కేంద్రానికి, ఇటు రాష్ర్టానికి ఇస్తుండటం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విలువైన భూములను ఇచ్చేస్తే.. సంస్థ భవిష్యత్తు అవసరాలు, కొత్త డిపోలు, బస్ల పారింగ్, వర్షాపులు, ఉద్యోగుల సంక్షేమం వంటి వాటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని వాపోతున్నారు. ‘ఆర్టీసీ ఆస్తులను కాపాడాలి.. మా భూములు మాకే కావాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. భూముల వ్యవహారంలో యూనియన్ల నేతలు స్పందించాలని కార్మికులు కోరుతున్నారు. ఆర్టీసీని పరిరక్షిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని కార్మికులు చెప్తున్నారు. బస్ల సంఖ్య పెంచుతామని, అందుకు అనుగుణంగా క్యూర్ పరిధిలో 20 కొత్త డిపోలు నిర్మిస్తామని, స్థలం సేకరిస్తున్నామని చెప్పి.. ఇప్పుడు ఆర్టీసీకి స్థలాలు లేకుండా చేస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.