హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లి పాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ముర్రుపాలు, తల్లిపాల ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నది. అనివార్య కారణాల వల్ల తల్లిపాలకు దూరమైన శిశువులను ఆదుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన కేంద్రాల్లో ‘మదర్స్ మిల్క్ బ్యాంకు’ల ఏర్పాటుకు సంకల్పించింది. వైద్యారోగ్య శాఖ 2017లో సుషేనా హెల్త్ ఫౌండేషన్తో కలిసి నిలోఫర్ దవాఖానలో స్థాపించిన ‘ధాత్రి-తల్లిపాల నిధి’ (మదర్స్ మిల్క్ బ్యాంక్) మంచి ఫలితాలను ఇవ్వడంతో మరో 13 కేంద్రాల్లో ‘మదర్స్ మిల్క్ బ్యాంకు’లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పేట్లబుర్జులో ఏర్పాటు చేసిన తల్లిపాల నిధి కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఇటీవలే ప్రారంభించారు.
బిడ్డ దూరంగా ఉన్నా తల్లిపాలు అందేలా
పుట్టిన ప్రతి బిడ్డకూ గంటలోగా తల్లిపాలు/ముర్రుపాలు అందించగలిగితే 22% శిశు మరణాలను అరికట్టవచ్చని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ, మన రాష్ట్రంలో 37% మం ది పిల్లలకు మాత్రమే ముర్రుపాలు అందుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు లేదా కుటుంబ సభ్యులకు అవగాహన లేక ముర్రుపాలు తాగించకపోవడం ఒక కారణమైతే.. ప్రసవానంతరం బిడ్డ అనారోగ్యానికి గురై తల్లికి దూరంగా ఐసీయూలో లేదా మరో వార్డులో ఉండటం మరో కారణం. కొన్ని సందర్భాల్లో తల్లి మరణిస్తే బిడ్డకు డబ్బాపాలను తాగించాల్సి వస్తున్నది. ఈ సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూనే మరోవైపు తల్లిపాల నిధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. తల్లులకు ఎక్కువగా పాలు రావడం, పుట్టిన వెంటనే పిల్లలు మరణించడం వంటి సందర్భాల్లోనూ తల్లులు తమ పాలను దానం చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఈ పాలను నిల్వ చేసేందుకు ప్రతి మిల్క్ బ్యాంకులో ఫ్రీజర్, ఫ్రిజ్ ఉంటాయి.
ఈ ఏడాది 3, వచ్చే ఏడాది 10
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 3 చోట్ల, వచ్చే ఏడాది పది చోట్ల మదర్స్ మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఈ ఏడాది హైదరాబాద్ పరిధిలోని పేట్లబుర్జు, సుల్తాన్బజార్ (జీఎంహెచ్), కొండాపూర్ లేదా సిద్దిపేటలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిలో ఇప్పటికే పేట్లబుర్జులో తల్లిపాల కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
పిల్లల ఆకలి తీరుతున్నది
మంత్రి హరీశ్రావు ఇటీవలే మా దవాఖానలో మదర్స్ మిల్క్ బ్యాంకును ప్రారంభించారు. ఇది రోజూ కనీసం 25-30 మంది పిల్లల ఆకలి తీర్చుతున్నది. మా దవాఖానలో కనీసం 30-35 మంది పిల్లలు వివిధ ఆనారోగ్య కారణాలతో ఎస్ఎన్సీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నేరుగా తల్లిపాలు తాగలేనివారికి మదర్స్ మిల్క్ బ్యాంక్ వరంగా మారింది. – పొన్నూరు మాలతి, సూపరింటెండెంట్, పేట్లబుర్జు దవాఖాన