స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మన రైతులు పండించిన వ్యవసాయోత్పత్తుల ఎగుమతి రానురానూ తగ్గుతూ వస్తున్నది. అదే సమయంలో విదేశాల నుంచి దిగుమతులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇది కేంద్ర ప్రభు త్వ వైఫల్యమేనని, దేశంలో పండించిన ధాన్యాన్ని అంతర్జాతీయంగా మార్కెట్ చేయటంలో ఫెయిల్ అవుతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రభా వం ప్రధానంగా మూడు వ్యవసాయోత్పత్తుల్లో కనిపిస్తున్నది. వీటిలో మొదటిది వంట నూనెలు, రెండోది పత్తి, మూడోది జీడిపప్పు.
వంటనూనెల దిగుమతుల విలువ 2020-21లో 1,109 కోట్ల డాలర్లు కాగా, 2021- 22లో 1,899 కోట్ల డాలర్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదేకాలంలో 2022-23 మూడో త్రైమాసికానికి (తొమ్మిది నెలలు) 1,404 కోట్ల డాలర్ల నుంచి 1,610 కోట్ల డాలర్లకు పెరిగింది. వంట నూనెల దిగుమతి పెరుగుదల 14.7 శాతం. 2020-21లో 13.13 టన్నుల నుంచి 2021-22 నాటికి (నవంబర్ నుంచి అక్టోబర్) 14.03 టన్నులకు దిగుమతులు పెరిగాయి. ఒక్క నవంబర్లో 2.36 టన్నులు పెరిగాయి. దేశ వార్షిక వంటనూనెల వాడకం అంచనా 22.5 నుంచి 23 మిలియన్ టన్నులుగా ఉండగా, అందులో 60 శాతం పెరిగాయి.
పత్తి ఎగుమతులు 2011-12లో 433 కోట్ల డాలర్లు. ఇది 2013-14లో 364 కోట్ల డాలర్లకు, 2016-17లో 162 కోట్ల డాలర్లకు, 2019-20లో 106 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత 2020-21లో 190 కోట్ల డాలర్లకు, 2021-22లో 282 కోట్ల డాలర్లకు చేరుకొన్నది. కానీ అదే ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్ నుంచి డిసెంబర్ 51.2 కోట్ల డాలర్లకు పడిపోవడమే కాకుండా, దిగుమతులు 41.45 కోట్ల డాలర్ల నుంచి 132 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఒక రకంగా భారత్ పత్తి నికర ఎగుమతిదారు నుంచి నికర దిగుమతిదారుగా మారిందని చెప్పవచ్చు.
2022 ఏప్రిల్-డిసెంబర్ మధ్య జీడిపప్పు దిగుమతులు 64.6 శాతం పెరగగా, 2021లో ఇది 99.64 కోట్ల నుంచి 164 కోట్ల డాలర్లకు చేరుకొన్నాయి. అదే సమయంలో జీడిపప్పు ఉత్పత్తుల ఎగుమతులు 34.6 కోట్ల నుంచి 2.97 కోట్ల డాలర్లకు పడిపోయాయి. సుగంధ ద్రవ్యాల్లో ఇదే ధోరణి కనిపించి ఎగుమతులు (295 కోట్ల నుంచి 275 కోట్లు) క్షీణించగా, దిగుమతులు మాత్రం 95.5 కోట్ల నుంచి 103 కోట్లకు పెరిగాయి.
దేశ వ్యవసాయ ఎగుమతులు 420-430 కోట్ల డాలర్లుగా ఉండగా.. 2020-21, 2021-22లో దేశ ఇండెక్స్ 90-95 పాయింట్లకు పతనం కావడంతో, ఎగుమతులు 330-340 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత మార్చి 2022లో 159.7 పాయింట్లకు చేరుకొన్నది. అప్పటి నుంచి ఇది ప్రతి నెలా పడిపోతూ, 2023 జనవరికి 131.2 పాయింట్లకు పడిపోయింది. తాజా పతనం సెప్టెంబర్ 2021 నాటి 128.2 పాయింట్ల కంటే అత్యల్పంగా నమోదైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, రాబోయే నెలల్లో భారతదేశ వ్యవసాయ ఎగుమతులు దారుణంగా మందగిస్తాయని అంచనా.