హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి రాముని ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్లో ఆక్రమణకు గురికావడం బాధాకరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. భద్రాద్రి రాముని భూముల విషయంలో విశాఖ శారదాపీఠం ధర్మపోరాటానికి కూడా వెనుకాడబోదని తెలిపారు. ‘ఏపీలో రాములోరి భూముల కబ్జా’ పేరుతో శనివారం ‘నమస్తేతెలంగాణ’లో వచ్చిన కథనానికి స్వామి స్పందించారు. ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఆక్రమణలకు గురైన భూముల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. భద్రాచలం ఈవో ఫిర్యాదుపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, ఎటపాక తాసిల్దార్ వెంటనే స్పందించి, చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో రామాలయ ఆస్తుల పరిరక్షణలో పీఠం జోక్యం చేసుకొని, భూములను పరిరక్షించిన విషయాన్ని గుర్తుచేశారు.