హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): న్యాయవ్యవస్థలో అట్టడుగువర్గాల ప్రాతినిథ్యం పెరగాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆకాంక్షించారు. ఓ దళిత న్యాయవాది పల్లె నాగేశ్వరరావు హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విప్లవాత్మకమైన మార్పు అని, ఇది ఎన్నో ఉద్యమాల తర్వాత సాధ్యమైందని చెప్పారు. దేశంలోని 23 హైకోర్టు బార్ అసోసియేషన్లలో తొలిసారిగా ఒక దళితుడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం తెలంగాణ హైకోర్టుకు నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావుకు మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభలో జూలూరు మాట్లాడారు. లాయర్లను నియమించుకోలేని వాళ్లకు లీగల్ ఎయిడ్ అందించడానికి బార్ అసోసియేషన్ కీలకపాత్ర పోషించాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల న్యాయవాదు లకు ఆర్థికధైర్యం కల్పించాలని సూచించారు.