హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీకాం కోర్సులకు గిరాకీ పెరుగుతున్నది. ఈ ఏడాది బీకాం కోర్సులో ఇంజినీరింగ్కు మించి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్లో 61,702 మంది చేరగా, బీకాంలో 77,017 మంది ప్రవేశాలు పొందారు. డిగ్రీ కోర్సుల్లో మొత్తం 1.90 లక్షల విద్యార్థులు చేరితే.. వీరిలో 40 శాతానికిపైగా బీకాం కోర్సునే ఎంచుకోవడం విశేషం. బీకాంలో చేరుతున్నవారి సంఖ్య గత మూడేండ్లుగా పెరుగుతున్నది. డిగ్రీ కోర్సుల్లో చేరిన వారిలో 2020-21లో 37.73% మంది, 2021-22లో 39.43% మంది బీకాం కోర్సును ఎంచుకున్నారు. బీకాం తర్వాత బీఎస్సీ (లైఫ్సైన్సెస్) కోర్సులపై ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఈ కోర్సులో 22% విద్యార్థులు చేరారు.
బీకాం కంప్యూటర్స్, బీకాం జనరల్ తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలు లభిస్తుండటంతో విద్యార్థులు వాటిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ కోర్సులతోపాటు స్పోకెన్ ఇంగ్ల్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, ట్యాలీ, అకౌంట్స్ ప్యాకేజీలపై పట్టుసాధిస్తే అపార అవకాశాలు అందివస్తున్నాయి. బిజినెస్ అనలిస్ట్, చార్టర్డ్ అకౌంటెంట్, మార్కెటింగ్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, కాస్ట్ అకౌంటెంట్, టీచర్, లెక్చరర్, మేనేజర్, కన్సల్టెంట్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలు లభిస్తున్నాయి. స్టాక్మార్కెట్, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లోనూ వీరికి డిమాండ్ పెరిగింది. కార్పొరేట్ కొలువులు కోరుకునే వారు.. ప్రతిష్ఠాత్మక ఐఐఎంలలో ఎంబీఏ, మేనేజ్మెంట్ ప్రోగ్రాముల్లోనూ చేరవచ్చు.
బీకాం చేస్తూనే ఆడిటర్స్ వద్ద పార్ట్టైమ్గా పనిచేస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదిస్తే ట్యాక్స్ కన్సల్టెంట్గా స్థిరపడొచ్చు. వీరు బీఈడీ, ఎంకాం వంటి కోర్సులను సైతం చేయవచ్చు. సీఏ, సీఎంఏ, కంపెనీ సెక్రటరీ వంటి రంగాల్లోనూ స్థిరపడొచ్చు. రూ.ఐదు కోట్లకుపైగా మూలధనం ఉన్న కంపెనీలు స్టాక్మార్కెట్లో నమోదు కావాలంటే కంపెనీ సెక్రటరీని నియమించుకోవడం తప్పనిసరి. ఈ హోదాను పొందాలంటే బీకాంతో పాటు, కంపెనీ సెక్రటరీ కోర్సును పూర్తిచేసి ఉండాలి. ఇలా అనేక కారణాల వల్ల కామర్స్కు డిమాండ్ పెరుగుతున్నది.