యాదాద్రి, ఆక్టోబర్ 31: యాదగిరిగుట్ట కొండగుహలో వెలిసిన స్వయంభూ నారసింహుడి దర్శనం మరింత శీఘ్రమైంది. స్వామివారి బ్రేక్ దర్శనానికి మొదటి రోజు విశేష స్పందన లభించింది. ఉదయం 9గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం సోమవారం విజయవంతంగా ప్రారంభించారు. రోజుకు 400 మందికి అనుమతినివ్వగా మొదటిరోజు 292 మంది భక్తులు దర్శించుకొన్నారు. కేవలం 5 నిమిషాల్లోనే స్వామివారి దర్శనం అద్భుతంగా, ప్రశాంతంగా జరిగినట్టు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం నుంచి త్రితల రాజగోపురం గుండా స్వయం భూ దర్శనానికి వెళ్లేందుకు ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా బ్రేక్ దర్శనం కల్పించారు. ఒక్కో భక్తుడికి రూ.300 టికెట్టుతో స్వామివారి దర్శనంతోపాటు గర్భగుడిలో హారతి ఇచ్చి, క్షేత్ర మహత్యాన్ని వివరించారు.
యాదగిరిగుట్టకు ప్రతి ఏడాది వస్తాం. కార్తీకమాసం సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చాం. మొదటిసారిగా బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకొన్నాం. స్వయంభూ నారసింహుడి దర్శనం ఎంతో ప్రశాంతంగా జరిగింది. బ్రేక్ దర్శనంలో తాగునీరు, ప్రత్యేక కుర్చీలు ఏర్పాటుచేశారు.
-వీరారెడ్డి, కల్యాణి దంపతులు, నిజామాబాద్