పెగడపల్లి, ఫిబ్రవరి 4: సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడటంతో పూరిల్లు దగ్ధమై కూతురు పెండ్లి కోసం దాచిన రూ.5 లక్షల నగదు, 5 తులాల బంగారం, 30 క్వింటాళ్ల పత్తి, 10 క్వింటాళ్ల బియ్యం బుగ్గిపాలయ్యాయి. ఈ సంఘటన శనివారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాజారాంపల్లిలో చోటుచేసుకొన్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజారాంపల్లికి చెందిన బండారి పెద్ద కనకయ్య భార్య లచ్చవ్వ, ఇద్దరు పిల్లలతో కలిసి ఓ పూరింట్లో నివసిస్తున్నాడు. కనకయ్య భార్య, కొడుకుతో కలిసి ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. కూతురు లావణ్య గ్యాస్స్టౌపై పాలు పెట్టి బయటకు వచ్చింది. ఇంతలోనే సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగి పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. కనకయ్య తన కూతురు లావణ్య పెండ్లి కోసం ఇటీవలే చిట్టి ఎత్తి రూ.5 లక్షల నగదును ఇంట్లో దాచుకొన్నాడు. 30 క్వింటాళ్ల పత్తి, 5 తులాల బంగారం, 10 క్వింటాళ్ల బియ్యం, వంట సామగ్రి, దుస్తులు కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు కనకయ్య బోరున విలపించాడు. విషయం తెలుసుకొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.