నాంపల్లి కోర్టులు, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): అక్రమాస్తుల కేసులో హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ బుధవారంతో ముగిసింది. 8 రోజుల కస్టడీలో చేపట్టిన విచారణలో రూ.250 కోట్ల అక్రమాస్తులను గుర్తించినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్టు తేలిందన్నారు. బుధవారం ఆయన నాంపల్లి కోర్టు ప్రాంగణంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. శివబాలకృష్ణ తన బంధువుల పేరిట జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్కర్నూల్ జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు వివరించారు.
తెలంగాణలో 29, ఏపీలోని విజయనగరం, విశాఖపట్నంలో 3 ఓపెన్ ప్లాట్లతోపాటు రూ.30.3 కోట్ల విలువైన 7 ఫ్లాట్లు, 3 విల్లాలను గుర్తించినట్టు తెలిపారు. బ్యాంకు లాకర్లో ఉన్న 18 తులాల బంగారం, ఓ పాస్బుక్ను జప్తు చేశామన్నారు. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్కుమార్ అరెస్టుతో మరో నలుగురు బినామీలను గుర్తించినట్టు చెప్పారు. శివనవీన్కుమార్ భార్య పేరిట ఉన్న ఆస్తులపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. శివబాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్ఎమ్డీఏ, మెట్రోరైల్ అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ కేసులో బెయిల్ కోసం శివబాలకృష్ణ, అతని సోదరుడు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై వాదనలను ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్టు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ ప్రకటించారు.