హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు ఖనిజాల బ్లాకులను కేంద్రం వేలం వేయనున్నది. దేశవ్యాప్తంగా టంగ్స్టన్, లిథియం, తగరం, రాక్ ఫాస్ఫేట్ వంటి ఖనిజాలతో సహా 19కీలక ఖనిజాల బ్లాక్లు ఉన్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలోని గోవిందాపూర్, పర్వతాపూర్లోని వనాడియం, టైటానియం, అల్యూమినియం, ల్యాటరైట్ మినరల్స్ బ్లాకులను వేలం వేయనున్నారు.
సోమవారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో కేంద్ర గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెండో విడుత ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ వేలం, ఏడో విడుత క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. నిరంతర విధానపరమైన సంస్కరణలు, పారదర్శక వేలం విధానాలు, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంపై దృష్టి సారించినట్టు తెలిపారు.
ఈ రంగంలో వృద్ధిని ప్రోత్సహిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నట్టు పేర్కొన్నారు. మంత్రి గడ్డం వివేక్ మాట్లాడుతూ.. పారదర్శక విధానాలు, వ్యాపారాల సౌలభ్యంతో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు.