హైదరాబాద్, ఫిబ్రవరి27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్, గంగాధర్గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ విరమణ పొందనున్నారని, ఈ నేపథ్యంలో ఆ మూడు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నట్టు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ప్రకటించారు. మార్చి 6న ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16న నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుందని తెలిపారు. మార్చి 23 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఆ తర్వాత కొద్దిసేపటికి ఫలితాలు వెల్లడిస్తారని వివరించారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మజ్లిస్ అభ్యర్థి మీర్జా రహమత్ బేగ్ ఏకగ్రీవమైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం రహమత్బేగ్కు ఎన్నికల అధికారి ప్రియాంక ధ్రువీకరణ పత్రం అందజేశారు. స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్ నామినేషన్ తిరస్కరించడంతో ఎన్నిక ఏకగీవ్రమైంది.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. మార్చి 13న పోలింగ్, మార్చి 16న ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఈ ఎన్నికకు ఏ వెంకట నారాయణ రెడ్డి(బీజేపీ), ఎల్ వెంకటేశ్వర్లు (ప్రజావాణి), ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ సంతోష్కుమార్, కే సాయన్న, కే జనార్దన్రెడ్డి, కే ప్రభాకర్, డాక్టర్ వెంకటేశ్వర్లు, జీ హర్షవర్ధన్రెడ్డి, గుర్రం చెన్నకేశవ రెడ్డి, సీ చంద్రశేఖర్, సీ పార్వతి, టీ అన్నత్ నారాయణ్, డీ మల్లారెడ్డి, డాక్టర్ వీ నాథనైల్, పాపన్నగారి మానిక్రెడ్డి, బీ భుజంగరావు, ఎం తిరుపతి, లక్ష్మీ నారాయణ మారంపల్లి, ఎస్ విజయ కుమార్, ఏ వినయ్బాబు పోటీ చేయనున్నారు.