నీలగిరి, జూన్ 22: అమెరికాలోని మేరీల్యాండ్లో నల్లగొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన నక్కా నర్సింహ, పద్మ దంపతుల కొడుకు సాయిచరణ్ (25) ఎంఎస్ చదువుకోసం 2020 ఆగస్టులో అమెరికా వెళ్లాడు. చదువు పూర్తికాగానే మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ సిటీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 4 గంటలకు తన స్నేహితులను విమానాశ్రయంలో దింపి కారులో ఇంటికి వస్తుండగా నల్లజాతీయులు అటకాయించే ప్రయత్నం చేశారు. అతడు ప్రతిఘటించడంతో దుండగులు రివాల్వర్తో కాల్పులు జరిపారు. సాయిచరణ్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లి అక్కడికక్కడే మృతిచెందాడు. ఓ చానల్లో వచ్చిన ఈ వార్తను చూసి అక్కడే స్థిరపడిన సాయిచరణ్ అక్క హారిక వివరాలు తెలుసుకొంది. మృతిచెందింది తన తమ్ముడేనని నిర్దారించుకొంది.
తన బాబాయ్ అమర్నాథ్కు విషయం తెలియజేయగా అతడు సాయిచరణ్ తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకు మృతి విషయం తెలుసుకొన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నవంబర్లో ఇంటికి రావాలనుకొన్న సాయిచరణ్ శుక్రవారం తనకు ఫోన్చేసి మాట్లాడినట్టు నర్సింహ గుర్తుచేసుకొని విలపించారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సాయిచరణ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను ఓదార్చారు. మంత్రి కేటీఆర్తో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.